అర్హత లేకున్నా ఎంబీబీఎస్ డాక్టర్లుగా ప్రాక్టీస్ చేస్తున్న వారిపై, అక్రమంగా క్లినిక్ లు నిర్వహిస్తున్న వారిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీఎస్ఎంసీ) కొరడా ఝుళిపిస్తున్నది. నకిలీ డిగ్రీని పెట్టుకోవడం, అర్హత లేకున్నా ప్రిస్క్రిప్షన్లు రాయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. ఇటీవల హైదరాబాద్లోని తుకారాం గేట్, మలక్ పేట, జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్, ఎన్ఆర్ పురం, అంబర్ పేట్ పటేల్ నగర్ లో ఐదుగురు నకిలీ డాక్టర్లపై టీఎస్ఎంసీ అధికారులు కేసులు నమోదు చేసి క్లినిక్ లు సీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి.
కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆర్ఎంపీలు, పీఎంపీల ముసుగులో డాక్టర్లుగా చెలామణి కావడం, ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ ఇవ్వడం, ఇష్టారాజ్యంగా అబార్షన్లు చేయడం, చిన్న రోగాలకు కూడా ఇష్టా రాజ్యంగా మందులు రాయడం, ఆయుష్ డాక్టర్లు అల్లోపతి మందులు రాయడం లాంటి అంశాలను ఈ సందర్భంగా టీఎస్ఎంసీ ఆఫీర్లు గుర్తించారు. డాక్టర్లుగా చెప్పుకునే ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నది.
