హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్టు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ చారి తెలిపారు. ఆరో తరగతి అడ్మిషన్లతో పాటు ఏడు నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తు గడువు శనివారంతో ముగిసింది.
దీంతో పేరెంట్స్ విజ్ఞప్తి మేరకు ఈ నెల10 వరకు గడువు పెంచినట్టు ఆయన చెప్పారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఓసీ అభ్యర్థులకు రూ.200, ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు రూ.125 పరీక్ష ఫీజుగా ఉంది. కాగా, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 31వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
