- సిఫార్సు చేసిన యూకే ప్రధాని కీర్స్టార్మర్.. ఆమోదించిన కింగ్ ఛార్లెస్
- 25 ఏండ్ల కింద యూకే వెళ్లి స్థిరపడిన సిద్దిపేట జిల్లా శనిగరం వాసి నాగరాజు
హైదరాబాద్: తెలంగాణ బ్యాక్గ్రౌండ్ కలిగిన ఉదయ్ నాగరాజు బ్రిటన్లోని ప్రతిష్టాత్మక హౌస్ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ నెల 10న బ్రిటన్ ప్రధాని కీర్స్టార్మర్ నాగరాజు పేరును సిఫార్సు చేయగా.. రాజు ఛార్లెస్3 లైఫ్పీర్ మెంబర్గా ఎంపిక చేశారు. హౌస్ ఆఫ్ లార్డ్స్ మెంబర్ అంటే భారతదేశంలో రాజ్యసభ ఎంపీ పదవి లాంటిది.
ఇకపై ఆయన హౌస్ ఆఫ్ లార్డ్స్లో సభ్యుడిగా బ్రిటన్ చట్టాలపై చర్చలు చేస్తారు. ఆయన్ను లార్డ్ ఉదయ్నాగరాజు లేదా బారన్ అనే పేరుతో పిలుస్తారు. ఉదయ్.. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా శనిగరంలో జన్మించాడు. వరంగల్లో స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేశాడు. మహారాష్ట్రలో ఇంజినీరింగ్ చదివాడు. 25 ఏండ్ల క్రితం బ్రిటన్ వెళ్లాడు. యూని వర్సిటీ కాలేజ్ లండన్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేశాడు.
ఐటీ ప్రొఫెషనల్గా పనిచేశాడు. ‘ఏఐ పాలసీ ల్యాబ్స్’ అనే థింక్ ట్యాంక్ను స్థాపించాడు. బ్రిటన్లో స్కూల్ గవర్నర్గా, వాలంటీర్గా, రాజకీయ నాయకుడిగా ఉన్నాడు. 2024 ఎన్నికల్లో నార్త్ బెడ్ ఫర్డ్ షైర్ నుంచి లేబర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి.. రెండో స్థానంలో నిలిచాడు. గ్లోబల్ ఏఐ పాలసీ, అడ్మినిస్ట్రేషన్, సమాజ సేవల్లో కృషి చేశాడు. ఆయనకు భార్య గౌరి, ఒక కూతురు ఉన్నారు.
దశాబ్దానికిపైగా బ్రిటన్లో ఉదయ్ చేస్తున్న కష్టానికి ఫలితమిదని రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉదయ్ నాగరాజు.. హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా ఎంపికవడం తెలంగాణకు, సిద్దిపేట జిల్లాకు గర్వకారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందించారు.
ఉదయ్ నాగరాజు నియామకం స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉదయ్ నాగరాజు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు బీజేపీ నేత ఎన్వీ సుభాష్కు బంధువు అవుతారు. ఉదయ్ క్రమశిక్షణ, సంకల్పం గొప్పవని, ఆయన నియామకం రాష్ట్రానికి గర్వకారణమని ఎన్వీ సుభాష్ తెలిపారు.
