నేతన్నకు భరోసా గైడ్ లైన్స్ రిలీజ్ : మంత్రి తుమ్మల

నేతన్నకు భరోసా  గైడ్ లైన్స్ రిలీజ్ : మంత్రి తుమ్మల
  • బడ్జెట్​లో 48 కోట్లు కేటాయింపు: మంత్రి తుమ్మల 
  • ఏడాదికి రెండు సార్లు ప్రోత్సాహకం ఇస్తం
  • 40వేల మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడి

హైదరాబాద్ ,వెలుగు: నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా తెలంగాణ నేతన్నకు భరోసా పథకం గైడ్ లైన్స్ ను రిలీజ్ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. ఈ స్కీమ్ కోసం బడ్జెట్ రూ. 48 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా జియో ట్యాగ్ చేయబడిన మగ్గాలపై పనిచేస్తున్న కార్మికులకు, అనుబంధ కార్మికులకు వేతన ప్రోత్సాహకం కింద గరిష్టంగా సంవత్సరానికి నేత కార్మికులకు రూ.18వేలు అనుబంధ కార్మికులకు రూ.6,000 అందించనున్నట్లు మంగళవారం పత్రిక ప్రకటనలో తెలిపారు.

 ఏటా 40వేల మంది చేనేత, అనుబంధ కార్మికులు లబ్ధి పొందుతారని మంత్రి తెలిపారు. చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలకు ప్రత్యేకంగా తయారుచేసిన యూనిక్ లోగోను జతచేయడం జరుగుతుందని, తద్వారా చేనేత ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలను నేత కార్మికుని వివరాలను వినియోగదారులు తెలుసుకోవచ్చని మంత్రి అన్నారు. తెలంగాణ చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరిగే అవకాశాలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఈ పథకం నేత, అనుబంధ కార్మికులందరికీ వర్తిస్తుందని, 18 ఏండ్లు నిండి జియో ట్యాగ్ చేసిన మరమగ్గాలపై పనిచేసే కార్మికులు, ప్రీలూమ్, ప్రిపరేటరి పనులైన డైయింగ్, టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్ మొదలైన అనుబంధ పనులు చేసే కార్మికులు, చేనేత వృత్తి ద్వారా వారి వార్షిక ఆదాయంలో కనీసం 50 శాతం పొందుతున్నవారు అర్హులని మంత్రి వెల్లడించారు.

 ఈ పథకం కింద జియో ట్యాగ్ చేయబడిన మగ్గాల ద్వారా వార్పులలో కనీసం 50 శాతం కంటే ఎక్కువ పూర్తి చేసిన లబ్ధిదారులైన నేత, అనుబంధ కార్మికులకు నేరుగా బ్యాంకు ఖాతాలోకి జమ చేశారు. రెండు విడుతలు వేతన ప్రోత్సాహకం కింద సంవత్సరానికి రెండు విడతలుగా (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నుంచి మార్చి) నేత కార్మికునికి రూ.9,000, అనుబంధ కార్మికునికి రూ.3,000 జమ చేస్తారని మంత్రి తుమ్మల తెలిపారు.