- రెండేండ్ల తర్వాత కొలువుదీరనున్న పంచాయతీ పాలకవర్గాలు
- ఉదయం 10:30 గంటలకు కార్యక్రమం.. తర్వాత తొలి సమావేశానికి శ్రీకారం
- ముగియనున్న స్పెషల్ ఆఫీసర్ల పాలన
హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో ప్రజాస్వామ్య పండుగకు వేళైంది. గత రెండేండ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పల్లెల్లో నేడు కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ప్రజల చేత ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రమాణ స్వీకారోత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఏకగ్రీవ పంచాయతీలు కలిపి 12,702 పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, 85,955 మంది వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కర్యక్రమం ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. ముందుగా వార్డు సభ్యులతో అధికారులు ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత సర్పంచ్, ఉప సర్పంచ్లు పదవీ స్వీకారం ప్రమాణ చేస్తారు. రాజ్యాంగంపై విశ్వాసం ఉంచుతామని, గ్రామ అభివృద్ధికి పాటుపడతామని దైవసాక్షిగా ప్రమాణం చేయనున్నారు.
ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే.. కొత్త సర్పంచ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రామంలో నెలకొన్న తాగునీరు, పారిశుధ్యం వంటి తక్షణ సమస్యలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే, తమకు ఓటేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పాలకవర్గం తీర్మానం చేయనుంది. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొన్ని సమస్యాత్మక గ్రామాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండేండ్ల తర్వాత పల్లె పగ్గాలు సర్పంచ్ల చేతికి వస్తుండడంతో.. ఇక గ్రామాభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.
రెండేండ్ల నిరీక్షణకు తెర..
గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసి రెండేండ్లు దాటింది. వివిధ కారణాల వల్ల ఎన్నికలు ఆలస్యమయ్యాయి. ఇన్నాళ్లూ పల్లె పాలన ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో సాగింది. తాజాగా ఎన్నికల ప్రక్రియ ముగిసి, ఫలితాలు వెలువడడంతో గ్రామాలు మళ్లీ ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్తున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత పాలకవర్గాలు బాధ్యతలు చేపడుతుండడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.
ముస్తాబైన పంచాయతీలు..
కొత్త సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలు కొత్త కళను సంతరించుకున్నాయి. నూతన పాలకవర్గానికి స్వాగతం పలికేందుకు కార్యాలయాలకు రంగులు వేసి, విద్యుత్ దీపాలతో అలంకరించారు. కొన్ని చోట్ల సొంత ఖర్చులతో సర్పంచ్లు ఆఫీసులను సుందరీకరించారు. షామియానాలు, పూల అలంకరణలతో జీపీలు పెళ్లి పందిళ్లను తలపిస్తున్నాయి. గ్రామస్తులు, గెలిచిన అభ్యర్థుల కుటుంబ సభ్యులు, అనుచరులతో సందడి నెలకొంది
