
- ఈ సీజన్ కొనుగోళ్ల టార్గెట్ 70 లక్షల టన్నులు
- ఇప్పటికే 39.37లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు
- బోనస్తో సెంటర్లకు పోటెత్తుతున్న సన్నవడ్లు
హైదరాబాద్, వెలుగు: యాసంగి వరికోతలు దాదాపు పూర్తవడంతో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8,245 సెంటర్లలో కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే నిర్దేశించుకున్న టార్గెట్లో 56 శాతానికిపై ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. యాసంగిలో లేటుగా వరి సాగు చేసిన ప్రాంతాల్లోనే కోతలు చివరి దశలో ఉన్నాయి. మిగతా అంతటా పూర్తి కాగా.. సెంటర్ల ద్వారా వడ్ల కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయి. సివిల్ సప్లయ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్ ఆధ్వర్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
కొనుగోళ్లు వేగంగా పూర్తయ్యేలా జిల్లా జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లయ్స్అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సర్కారు మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ అమలు చేస్తున్న నేపథ్యంలో సెంటర్లకు సన్నవడ్లు పోటెత్తుతున్నాయి.
నిరుడితో పోలిస్తే పెరిగిన కొనుగోళ్లు
ఈ ఏడాది యాసంగి వడ్ల కొనుగోళ్లు 25 రోజుల ముందగానే ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ కొనుగోలు సెంటర్లను ప్రారంభించింది. గడిచిన 50 రోజుల్లో 5.77లక్షల మంది రైతుల నుంచి 39.37లక్షల టన్నుల వడ్ల కొనుగోళ్లు జరిగాయి. నిరుడు ఇదే టైమ్కు 28.34 లక్షల టన్నుల వడ్లు కొన్నారు. అంటే ఈ యేడు నిరుడి కంటే 11 లక్షల టన్నులు అదనంగా కొనుగోళ్లు జరిగాయి. ప్రతిరోజూ లక్షన్నర టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నట్లు సివిల్ సప్లయ్స్ వర్గాలు వెల్లడించాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 7.47 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. నల్గొండ జిల్లా 4.55 లక్షల టన్నుల వడ్ల కొనుగోళ్లతో రెండో స్థానంలో నిలిచింది.
ఆ తర్వాత కామారెడ్డి జిల్లాలో 2.90 లక్షల టన్నులు, జగిత్యాలలో 2.18 లక్షల టన్నులు, సూర్యాపేట జిల్లాలో 2 లక్షల టన్నులు, కరీంనగర్ జిల్లాలో 1.94 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. రంగారెడ్డి, సిద్దిపేట, నారాయణపేట, హన్మకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో కొనుగోళ్లు కాస్త నెమ్మదిగా జరుగుతున్నాయి. అకాల వర్షాలతోనూ పలుచోట్ల కొనుగోళ్లకు అడ్డంకులు ఎదురయ్యాయి. ఇప్పుడు వర్షాలు తగ్గిపోవడంతో కొనుగోళ్లు తిరిగి ఊపందుకున్నాయి. .
టార్గెట్లో 56.24 శాతం కొనుగోళ్లు
ఈ యాసంగిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 59.84 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. సన్న ధాన్యానికి సర్కారు బోనస్ ప్రకటించడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో యాసంగి వరి ధాన్యం 1.30 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనాలు వేసింది. సాగైన వరిలో 60 శాతానికి పైగా సన్న రకాలే సాగు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 70 లక్షల టన్నుల ధాన్యం.. కొనుగోలు సెంటర్లకు వచ్చే అవకాశం ఉందని సివిల్ సప్లయ్స్ శాఖ అంచనా వేస్తున్నది.
సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ పెట్టుకున్న టార్గెట్లో ఇప్పటికే 56.24 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో సన్నబియ్యాన్ని సర్కారు రేషన్ లబ్ధిదారులకు అందిస్తున్నది. ఈ నేపథ్యంలో మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ చెల్లించి, రైతులనుంచి ప్రభుత్వం ధాన్యాన్ని సేకరిస్తున్నది. దీంతో మార్కెట్కు వస్తున్న ధాన్యంలో ఎక్కువశాతం సన్న వడ్లు ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. చాలా జిల్లాల్లో గతంలో వ్యాపారులకు అమ్ముకునే సన్న ధాన్యం.. ఇప్పుడు సెంటర్లకే ఎక్కువగా వస్తున్నది. అదనంగా ధర వస్తుండడంతో సెంటర్లకు సన్న వడ్లు పోటెత్తుతున్నాయి.