ఎల్లారెడ్డిపేట, వెలుగు: బతుకుదెరువు కోసం మస్కట్ కు వెళ్లిన ఓ కార్మికుడు గుండెపోటుతో మృతిచెందాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన బత్తుల నర్సింలు(50) పదిహేనేండ్లుగా మస్కట్ లో పనిచేస్తున్నాడు. ఈ నెల 6న ఉదయం పనిచేస్తుండగా గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన డెడ్బాడీ కోసం కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని డెడ్బాడీని ఇండియాకు రప్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మృతుడికి భార్య రేణుక, కొడుకు రాకేశ్ ఉన్నారు.
జగిత్యాల జిల్లా వాసి..
రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ గ్రామానికి చెందిన వడ్లూరి రాజేందర్ (40) గల్ఫ్లో గుండెపోటుతో మృతిచెందాడు. ఆరు నెలల క్రితం అజాద్ వీసాపై దుబాయికి వెళ్లిన రాజేందర్ అక్కడ కూలీ పనులు చేస్తున్నాడు. ఈ నెల 12న పనులు ముగించుకుని గదికి చేరుకున్న రాజేందర్ కు భోజనం చేసి నిద్రించే సమయంలో గుండెనొప్పి వచ్చింది. స్నేహితులు హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. డెడ్బాడీని ఇండియాకు తీసుకొచ్చేందుకు స్నేహితులు ప్రయత్నిస్తున్నారు.
