
- లోకల్బాడీ ఎన్నికలపై మీరు మాట్లాడటమేంది?
- మంత్రి పొంగులేటి తీరుపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్!
హైదరాబాద్, వెలుగు: ఈ నెలాఖరులోగా లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్ అయినట్లు తెలిసింది. ‘‘స్థానిక సంస్థల ఎన్నికల అంశం రిజర్వేషన్లతో ముడిపడి ఉంది.. రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత రాలేదు. అదీగాక కేబినెట్లో చర్చించాల్సిన విషయాలను బయట ఎలా మాట్లాడుతారు. వేరే మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశంపై మీరెలా ప్రకటన చేస్తారు?’’ అని ఆయన అన్నట్లు సమాచారం.
సోమవారం ఉదయం పొంగులేటికి మహేశ్గౌడ్ ఫోన్ చేసి తన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని తన క్యాంపు ఆఫీసులో ఆదివారం పార్టీ నాయకులతో సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెలాఖరులోగా షెడ్యూల్ విడుదలవుతుందని, కేబినెట్ సమావేశంలో ఎన్నికల తేదీలు ప్రకటిస్తామని వెల్లడించారు. ఇది మీడియాలో రావడంతో.. బీసీ రిజర్వేషన్లపై తేల్చకుండా ఎలక్షన్లు పెడ్తే ఊరుకోమని బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ మంత్రి పొంగులేటికి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, పార్టీతో సంప్రదించకుండా మరోసారి ఇలాంటి ప్రకటనలు చేయొద్దని ఆయన సూచించినట్లు సమాచారం. మంత్రులెవరైనా వారి శాఖల పరిధిలోని అంశాలను మాత్రమే మాట్లాడాలని, సున్నితమైన అంశాల జోలికి వెళ్లవద్దని చెప్పినట్లు తెలిసింది.