
- అనుచరులతో కౌశిక్రెడ్డి ఇంటికి చేరుకున్న గాంధీ
- టమాటాలు, గుడ్లు, రాళ్లతో దాడి.. పూలకుండీలు ధ్వంసం
- ఎమ్మెల్యే గాంధీ, అనుచరులపై కేసులు నమోదు
- పోలీసుల నిర్లక్ష్యంతోనే దాడి జరిగిందన్న హరీశ్ రావు
- సీపీ ఆఫీసులో బైఠాయింపు.. మా ప్రభుత్వం
- వచ్చాక చూస్కుందామని వార్నింగ్
గచ్చిబౌలి, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్రెడ్డి మధ్య మాటల యుద్ధం ముదిరి దాడి చేసుకునేవరకూ వెళ్లింది. కౌశిక్రెడ్డి ఇంటిపైకి గాంధీ తన అనుచరులతో రావడం, పోలీసులు అడ్డుకోవడం, ధర్నా చేయడం, గాంధీ అనుచరులు రెచ్చిపోయి కౌశిక్ఇంటి అద్దాలు, పూల కుండీలను ధ్వంసం చేయడం లాంటి ఘటనలతో ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్అగ్ర నేతలు కౌశిక్రెడ్డిని పరామర్శించేందుకు వచ్చి ఘటనకు పోలీసులే బాధ్యులంటూ వారిపై చర్యలు తీసుకోవాలని సైబారాబాద్సీపీ ఆఫీసులో బైఠాయించారు. దీంతో అందరినీ అరెస్ట్ చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.
Also Read:-ఎంబీబీఎస్ సీట్లపై యూజీసీ పిడుగు
ఎమ్మెల్యేల పరస్పర సవాళ్లు
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పోస్టు ఇచ్చింది. ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పోస్టు ఇవ్వాలని, కానీ, సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్నుంచి కాంగ్రెస్లో చేరినందుకే గాంధీకి పీఏసీ చైర్మన్ ఇచ్చారని బీఆర్ఎస్ లీడర్లు విమర్శించారు. దీనిపై పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే గాంధీ కౌంటర్ ఇచ్చారు. తాను కాంగ్రెస్ లో చేరలేదని, ఆ పార్టీ కండువా కప్పుకోలేదని చెప్పారు. తాను సీఎంను కలిసినప్పుడు కప్పింది కాంగ్రెస్ కండువా కాదని వివరణ ఇచ్చారు. దీనికి హుజూరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పందిస్తూ గాంధీ కాంగ్రెస్లో చేరలేదంటున్నాడని, అదే నిజమైతే తాను కార్యకర్తలతో కలిసి గురువారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వస్తానని, అక్కడ గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పి, ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాననన్నారు. తర్వాత తెలంగాణ భవన్కు వెళ్లి ప్రెస్మీట్పెట్టి కేసీఆర్ఇంటికి వెళ్దామని సవాల్ విసిరారు.
నా ఇంటికి రాకపోతే నీ ఇంటికొస్త
కౌశిక్రెడ్డి సవాల్కు స్పందించిన గాంధీ వివేకానందనగర్లో ఉన్న తన ఇంటికి 11 గంటల వరకు రాకపోతే తానే 12 గంటలకు కొండాపూర్లోని ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఇంటికి వస్తానన్నారు. బ్రోకర్లు, కోవర్టులు వచ్చి తన ఇంటిపై జెండా ఎగరవేస్తా అంటే ఊరుకునేది లేదన్నారు.
కౌశిక్రెడ్డి ఇంటి దగ్గర బందోబస్తు
ఇద్దరు ఎమ్మెల్యేల సవాళ్లు, ప్రతి సవాళ్లతో గురువారం ఉదయం సైబరాబాద్ పోలీసులు కొండాపూర్లోని కొల్లు లక్సూరియా విల్లాస్ వద్ద, వివేకానంద నగర్లోని ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్రెడ్డిని బయటకు వెళ్లకుండా హౌస్అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12:30 గంటలకు ఎమ్మెల్యే గాంధీ, తన అనుచరులతో కలిసి కొండాపూర్లోని కౌశిక్రెడ్డి ఇంటికి భారీ కాన్వాయ్తో చేరుకున్నారు. విల్లాస్ మెయిన్ గేట్వద్ద సైబరాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గాంధీ అనుచరులు గేట్ను తోసుకుంటూ లోపలికి చొచ్చుకుపోయారు.
కౌశిక్రెడ్డి ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలు, రాళ్ల దాడి
ఎమ్మెల్యే గాంధీ అనుచరులు కొందరూ కౌశిక్రెడ్డి ఇంటిపైకి కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లతో దాడి చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న పూలకుండీలను పగులగొట్టారు. అక్కడే ఉన్న కౌశిక్రెడ్డి అనుచరులు గాంధీ అనుచరులపైకి గుడ్లు, టమాటాలు, రాళ్లతో దాడికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గాంధీ, అతని అనుచరులను మాదాపూర్ ఏసీపీ, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్అదుపులోకి తీసుకొని రాయదుర్గం పీఎస్కు తరలించారు. తర్వాత అక్కడి నుండి నార్సింగి పీఎస్కు తీసుకువెళ్లారు.
సైబరాబాద్ సీపీ ఆఫీస్కు బీఆర్ఎస్ నేతలు
విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, వివేకానందగౌడ్, మాధవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వర్రెడ్డి, మాగంటి గోపీనాథ్ తదితరులు కౌశిక్రెడ్డిని పరామర్శించేందుకు ఆయన ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ దాడిని ఎమ్మెల్యే గాంధీ, అతడి అనుచరులు చేసినట్లుగా భావిస్తలేమని, సీఎం రేవంత్రెడ్డి చేయించినట్లుగా భావిస్తున్నామన్నారు. మాదాపూర్ఏసీపీ, గచ్చిబౌలి సీఐలను సస్పెండ్ చేయాలన్నారు. ప్రతి దాడులు చేసే సత్తా తమకు కూడా ఉందన్నారు. తర్వాత దాడిపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైబరాబాద్సీపీ ఆఫీస్కు వెళ్లారు.
రెండు కేసులు నమోదు
కౌశిక్రెడ్డి ఇంటిపై దాడి ఘటనలో పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. గచ్చిబౌలి ఎస్ఐ మహేశ్కుమార్గౌడ్ఇచ్చిన ఫిర్యాదుతో.. కౌశిక్రెడ్డి ఇంట్లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, మియాపూర్కార్పొరేటర్ఉప్పలపాటి శ్రీకాంత్ తో పాటు 30 మందిపై కేసు పెట్టినట్టు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. బీఆర్ఎస్లీడర్ఆర్ఎస్ప్రవీణ్కుమార్తో కలిసి ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి గచ్చిబౌలిలోని మాదాపూర్డీసీపీ వినీత్కు కంప్లయింట్ ఇవ్వగా గచ్చిబౌలి పోలీసులు హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద మరో కేసు ఫైల్ చేశారు.
సైబరాబాద్ కమిషనరేట్లో బీఆర్ఎస్ హైడ్రామా..
అరికెపూడి గాంధీ, అతడి అనుచరులను అరెస్ట్ చేయాలని సైబరాబాద్ సీపీకి కంప్లయింట్ఇవ్వడానికి వెళ్లిన బీఆర్ఎస్లీడర్లను లోపలికి అనుమతించకపోవడంతో కౌశిక్రెడ్డి, హరీశ్రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీపీ అవినాశ్ మహంతి అందుబాటులో లేకపోవడంతో జాయింట్సీపీకి ఫిర్యాదు చేశారు. సీపీ వచ్చి న్యాయం చేసే వరకు ఎక్కడికి కదలబోమని కమిషనరేట్ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి పోలీస్అధికారికి వేలు చూపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్రావు కలుగజేసుకొని సదరు అధికారికి వార్నింగ్ ఇచ్చాడు. ‘నీ పేరేంది. నాలుగేండ్ల తర్వాత మళ్లీ వస్తం.. అప్పుడు చూస్కుందాం’ అని హెచ్చరించారు. దీంతో తమ డ్యూటీ తాము చేస్తున్నామని సదరు పోలీస్ ఆఫీసర్బదులిచ్చారు. తాము కేసులు నమోదు చేశామని చెప్పినా వినకుండా బీఆర్ఎస్ లీడర్లు ఆందోళన చేపట్టడంతో హరీశ్రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి సిటీ శివారు పోలీసు స్టేషన్లకు తరలించారు.
కేశంపేట పీఎస్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన
షాద్ నగర్, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్ ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ లీడర్లు హరీశ్రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, గాయత్రి రవి, పల్లా రాజేశ్వర్ రెడ్డిని పోలీసులు కేశంపట పీఎస్కు తరలించగా మార్గమధ్యంలో బీఆర్ఎస్ లీడర్లు అడ్డుకున్నారు. కొత్తూరు మండలంలోని ఇన్ముల్ నర్వ గ్రామంలో పోలీస్ వాహనాలకు అడ్డు రాగా పక్కకు తప్పించి వెళ్లిపోయారు. కొత్తపేటలోనూ అడ్డు రావడంతో స్వల్ప లాఠీ చార్జి చేసి కేశంపేట పీఎస్కు తరలించారు. ఈ సందర్భంగా తమను ఇక్కడికి ఎందుకు పట్టుకువచ్చారో చెప్పాలంటూ ఏసీపీ రంగస్వామితో హరీశ్రావు వాగ్వాదానికి దిగారు. ‘10 వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడికి వస్తరు చూడు’ అని వార్నింగ్ఇచ్చారు. ఈ క్రమంలో పీఎస్బయట బీఆర్ఎస్కార్యకర్తలు ఆందోళనకు దిగి నినాదాలు చేస్తుండడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి బీఆర్ఎస్ నేతలందరినీ పోలీసులు వదిలేశారు.
నన్ను మర్డర్ చేసే ప్లాన్తో వచ్చారు
గాంధీ, అతడి అనుచరులు తన ఇంటిపై దాడి చేసేందుకు వస్తే ఎందుకు అడ్డుకోలేదని కౌశిక్రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ బిడ్డలం, ఆంధ్రావాళ్లు దాడి చేస్తే ఊరుకుంటామా, తెలంగాణ పవరేంటో రేపు(సెప్టెంబర్ 13)న చూపిస్తానని సవాల్విసిరారు. చర్యకు ప్రతి చర్య తప్పక ఉంటుందని హెచ్చరించారు. తనను మర్డర్చేయాలనే ప్లాన్తోనే వచ్చారని ఆరోపించారు. బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.