
- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన
- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ప్రజాపాలన వేడుకలు
కరీంనగర్, వెలుగు: భారతదేశంలో హైదరాబాద్ రాజ్యం విలీనమైన రోజును పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ ప్రజాపాలన వేడుకలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కరీంనగర్ జిల్లా పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, పెద్దపల్లి జిల్లాలో మహ్మద్ ఒబెదుల్లా కొత్వాల్ సాహెబ్ జాతీయ జెండా ఎగురవేశారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణ 1948 సెప్టెంబర్ 17న నిజాం చెర నుంచి విముక్తి పొంది, భారతదేశంలో విలీనమైందని గుర్తు చేశారు.
ఎందరో మహానుభావులు తెలంగాణ గడ్డపై జన్మించి ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేశారన్నారు. తెలంగాణ ఒక అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని, అణగదొక్కబడిన తెలంగాణ ప్రాంతంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం దశాబ్దాలుగా పోరాటాలు కొనసాగాయని తెలిపారు.
కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌష్ ఆలం, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ సత్తు మల్లేష్, కాంగ్రెస్ నేత అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, పోలీస్ కమిషనరేట్లో సీపీ గౌస్ ఆలం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
కోరుట్ల/రాయికల్/కోనరావుపేట/చొప్పదండి, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలు, మండలకేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ ఆఫీసుల్లో ప్రజాపాలన వేడుకలు ఘనంగా జరిగాయి.