రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రెండ్రోజులు(సెప్టెంబర్ 20, 21) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని ప్రకటించింది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని చెప్పింది.
అదే సమయంలో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3.1 డిగ్రీల అధికంగా 36 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయే ఛాన్స్ ఉందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాల తిరోగమనం సమయం దగ్గరపడుతున్నదని స్పష్టం చేసింది.
ALSO READ: గుజరాత్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు.. సురక్షిత ప్రాంతాలకు 12వేల మంది తరలింపు
ఈ ప్రభావంతో పలు రాష్ర్టాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా రాగల రెండురోజుల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
ఇక ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు(సెప్టెంబర్ 19) బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పారు. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు కురుస్తాయన్నారు.
సెప్టెంబర్ 19 అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.