
- పొద్దున్నే రేషన్ షాపుల ఎదుట క్యూ కడుతున్న జనాలు
- ఒక్కో కార్డుకు పావుగంట పైనే టైమ్.. రోజుకు 50 మందికే
- ఎంఎల్ఎస్ పాయింట్లలో కాంటా వేయకుండానే రేషన్ సప్లై
- ఒక్కో బ్యాగులో కేజీ పైనే తరుగు వస్తోందంటున్న డీలర్లు
- జిల్లాలో 2.20 లక్షల కార్డులు..4,300 టన్నుల బియ్యం పంపిణీ
మంచిర్యాల, వెలుగు: వానాకాలం సీజన్ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల ఒకటినుంచి రేషన్ షాపుల్లో లబ్దిదారులకు మూడు నెలల రైస్ ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని డీలర్లు వాపోతున్నారు. ఒక్కో లబ్ధిదారుడి నుంచి కనీసం ఆరుసార్లు బయోమెట్రిక్ తీసుకోవాల్సి రావడం ఇబ్బందిగా మారిందని అంటున్నారు. దీంతో ఒక్కొక్కరికి పావుగంట పైనే టైమ్ పడుతోందంటున్నారు.
కేంద్ర, రాష్ట్రాల బియ్యం వేర్వేరుగా..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బియ్యం వేర్వేరుగా పంపిణీ చేయాల్సి రావడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం కార్డుల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఎస్ఎఫ్ఏ కార్డులు 55 లక్షలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కార్డులు 32 లక్షలు ఉన్నాయి. ఎన్ఎస్ఎఫ్ఏ కార్డులకు కేంద్రం ఇచ్చే ఐదు కిలోలకు, రాష్ట్రం మరో కిలో కలిపి ఒక్కో యూనిట్కు ఆరు కిలోలు పంపిణీ చేస్తోంది. వీటికి వేర్వేరుగా బయోమెట్రిక్ సేకరిస్తున్నారు. ఇలా ప్రతి నెల రెండుసార్లు బయోమెట్రిక్ వేస్తుండగా, ఈసారి మూడు నెలల రేషన్కు ఆరుసార్లు తీసుకోవాల్సి వస్తోంది. మారుమూల ప్రాంతాల్లో నెట్వర్క్సరిగా లేకపోవడం, సర్వర్ డౌన్ కావడం, ఈ పోస్ మెషీన్లు మోరాయించడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
పొద్దటి నుంచే పడిగాపులు
ప్రభుత్వం రేషన్ కార్దుదారులకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో ప్రతి ఒక్కరూ బియ్యం తీసుకుంటున్నారు. గతంలో దొడ్డు బియ్యం తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపనివాళ్లు కూడా ప్రస్తుతం సన్నబియ్యం కోసం ఎగబడుతున్నారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతుకూలీలు త్వరగా బియ్యం తీసుకెళ్లడానికి పొద్దటి నుంచే రేషన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. కానీ ఒక్కో కార్డుకు బియ్యం పోయడానికి పావుగంట పైనే పడుతోందని డీలర్లు పేర్కొంటున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 50 కార్డులకు మించి బియ్యం పోయలేకపోతున్నామని చెప్తున్నారు.
క్వింటాలుకు రెండు కేజీలు లాస్
ప్రభుత్వం రేషన్ షాపులకు 50 కేజీల బస్తాలను సప్లై చేస్తుండగా, ఒక్కో బ్యాగులో కిలో వరకు తక్కువగా వస్తున్నాయని డీలర్లు చెప్తున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి కాంటా వేయకుండానే రేషన్ షాపులకు బియ్యం సప్లై చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయం అధికారులను అడిగితే.. ఒక్కో షాపునకు సపరేట్ కాంటా వేయాలంటే సప్లై లేట్ అవుతుందని, అందువల్ల లారీలను బల్క్గా కాంటా వేసి రెండు మూడు షాపులకు సప్లై చేస్తున్నామని చెప్తున్నారు.
ఈ విషయమై చాలాకాలం నుంచి ఫిర్యాదులు వస్తున్నా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో క్వింటాలుకు రెండు, మూడు కిలోల చొప్పున నష్టపోతున్నామని డీలర్లు వాపోతున్నారు. జిల్లాలో 2.20 లక్షల కార్డులు ఉండగా, ప్రతినెలా 4,300 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 423 రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. మూడు నెలల కోటా కలిపి 12,900 మెట్రిక్ టన్నులు ఈ నెలలోనే పంపిణీ చేయనున్నారు.
ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ: కలెక్టర్
నస్పూర్, వెలుగు: జిల్లాలోని రేషన్ కార్డుదారులు మూడు నెలల బియ్యం తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం నస్పూర్లోని 5, 8 నంబర్ రేషన్ షాపులను సందర్శించి రేషన్ పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ నెల 30 వరకు బియ్యం పంపిణీ చేస్తామన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తినట్లయితే ఈ పోస్ ఇంజనీర్లు వెంటనే పరిష్కరించి బియ్యం పంపిణీ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సన్నబియ్యం స్టాక్ సరిపడా ఉందని, కార్డుదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు.
సజావుగా పంపిణీ చేస్తున్నాం
జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ సజావుగా జరుగుతోంది. మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయాల్సి రావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో కార్డుకు ఆరుసార్లు బయోమెట్రిక్ తీసుకోవడంతో కొంత జాప్యం జరుగుతోంది తప్ప ఎలాంటి సమస్యలు లేవు. శుక్రవారం నుంచి మూడుసార్లు మాత్రమే బయోమెట్రిక్ తీసుకునేలా చర్యలు తీసుకుంటాం. జిల్లాలో మూడు నెలలకు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయి. రేషన్ షాపుల్లో స్టాక్అయిపోతే వెంటనే సప్లై చేస్తున్నాం.- బ్రహ్మారావు, డీసీఎస్వో