హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతున్నది. గురువారం రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టెంపరేచర్లు భారీగా పడిపోయాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, జనగామ, పెద్దపల్లి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువైంది. గురువారం రాత్రి అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా బేలలో 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్లో 15.2, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 16, రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో 16.4, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 16.5, కామారెడ్డి జిల్లా దోమకొండలో 16.8, మెదక్ జిల్లా దొంగల ధర్మారంలో 16.9, జగిత్యాలలో 17, నిజామాబాద్ జిల్లా సాలూరలో 17.1, రంగారెడ్డి జిల్లా కందువాడలో 17.3, సిద్దిపేట జిల్లా కొండపాకలో 17.4, నిర్మల్ జిల్లా తాండ్రలో 17.8 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
