గ్లోబల్‌ సమ్మిట్లో‌ స్టాల్స్.. అదరహో ! తెలంగాణ సంస్కృతి ప్రతిబింభించేలా ప్రదర్శనలు

గ్లోబల్‌ సమ్మిట్లో‌ స్టాల్స్.. అదరహో ! తెలంగాణ సంస్కృతి ప్రతిబింభించేలా ప్రదర్శనలు

హైదరాబాద్‌‌లోని ఫ్యూచర్​సిటీ వేదికగా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న, చేయబోతున్న పథకాలపై ఏర్పాటుచేసిన స్టాల్స్ దేశ, విదేశీ అతిథులను​ ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీటితో పాటు పలు ప్రైవేటు సంస్థలూ తమ ఎక్స్‌‌క్లూజివ్‌‌ ప్రొడక్ట్స్‌‌ను ప్రదర్శించాయి. ఎగ్జిబిషన్‌‌ స్టాల్‌‌లో గెస్ట్‌‌లకు వెల్‌‌కమ్ చెప్పేందుకు.. కావాల్సిన స్టాల్స్‌‌కు తీసుకెళ్లేందుకు రెండు ప్రత్యేకమైన రోబోలను ఏర్పాటు చేశారు.

 సమ్మిట్‌‌ వద్దకు వచ్చిన సీఎం రేవంత్‌‌రెడ్డితో పాటు, ఇతర గెస్ట్‌‌లకూ ఓ రోబో హాయ్‌‌ చెబుతూ ముందుకు కదలగా.. ‘టెమి’ అనే మరో ‘గైడ్’ రోబో గెస్ట్‌‌లను స్టాల్స్‌‌ వద్దకు తీసుకెళ్లింది. సమ్మిట్‌‌ వద్ద మొత్తంగా 27 స్టాల్స్‌‌ను ఏర్పాటు చేయగా.. తెలంగాణ హ్యాండీ క్రాఫ్ట్స్, టూరిజం, ఎడ్యుకేషన్, ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కరీంనగర్ నగిషీ, ఇక్కత్​ ఫ్యాబ్రిక్, చేర్యాల పెయింటింగ్స్, ఇతర హ్యాండీ క్రాఫ్ట్స్‌‌, వాటి ప్రత్యేకతల గురించి స్టాల్స్​నిర్వాహకులు విదేశీ ప్రతినిధులకు వివరించారు.

 ‘మూసీ నది పునరుజ్జీవనం’ కాన్సెప్ట్‌‌తో ఏర్పాటుచేసిన స్టాల్‌‌ అందరినీ ఆలోచింపజేసింది. అడ్వాన్డ్స్‌‌ టెక్నాలజీ సాయంతో పనిచేసే డ్రోన్స్ ఎగ్జిబిట్ ఆలోచింపజేసేలా ఉంది. సైబర్ క్రైమ్ కేసుల ఛేదనలో అత్యాధునిక టెక్నాలజీ వినియోగం, పోలీసులు వెళ్లలేని చోటుకి ఏఐ ఇంటిగ్రేటెడ్ డ్రోన్స్‌‌ను పంపిస్తామని అధికారులు వివరించారు. - హైదరాబాద్, వెలుగు