
గతంతో పోలిస్తే మే నెలలో 70 కోట్లు అదనం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రవాణా శాఖకు కాసుల పంటపండుతోంది. మే నెలలో ఆర్టీఏకి ఆదాయం పెరిగింది. సర్కారు ఇటీవల వివిధ రకాల ట్యాక్స్లు పెంచడంతో ఆమ్దానీ మస్తుగ సమకూరింది. ఒక్క నెలలోనే దాదాపు రూ.70 కోట్ల దాకా అదనంగా ఇన్కం వచ్చింది. మరోవైపు రాష్ట్రంలో వాహన రిజిస్ట్రేషన్లు కూడా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా 56 ఆర్టీవో, యూనిట్ ఆఫీస్లు ఉండగా.. ఆయా కేంద్రాలకు రోజూ లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సరిఫికెట్లతో సహా వివిధ రకాల సేవల కోసం వేల సంఖ్యలో జనం వస్తుంటారు. ఇందుకోసం ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. అయితే ఇటీవల వరకు నెలకు సగటున నెలకు రూ.300 నుంచి రూ.330 కోట్ల ఆదాయం సమకూరేది. అయితే మే నెలలో 405 కోట్ల ఇన్కం వచ్చింది.
40 శాతం దాకా పెంపు
ఆదాయం కోసం వెతుకులాడుతున్న సర్కారు.. ఇటీవలే ఆర్టీఏ ట్యాక్స్ పెంచింది. లైఫ్ ట్యాక్స్, క్వార్టర్లీ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ పెంచేసింది. మొత్తంగా 30 నుంచి 40 శాతం దాకా బాదేసింది. లైఫ్ ట్యాక్స్ టూవీలర్ పై రూ.3 వేలు, ఫోర్ వీలర్పై రూ.80 వేల దాకా, టెన్ సీటర్ బండ్లపై 1.20 లక్షల వరకు అదనంగా పెంచారు. ఇక గ్రీన్ ట్యాక్స్ ఇప్పటి దాకా రూ.వెయ్యిలోపే ఉండగా, రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచారు. క్వార్టర్లీ ట్యాక్స్ 25 శాతం దాకా పెంచారు. ట్రావెల్స్ టెన్ సీటర్ బండికి ఇప్పటి దాకా రూ.20 వేలు ఉండగా, ఇప్పుడు రూ.25 వేలకు పెరిగింది. మొత్తంగా అన్ని రకాల ట్యాక్స్లతో సంవత్సరానికి వాహనదారులు, ట్రావెల్స్ యజమానులపై రూ.రెండు వేల కోట్ల అదనపు భారం పడనుంది.