- మాజీ సర్పంచ్ల సంక్షేమ సంఘం ప్రకటన
ఖైరతాబాద్, వెలుగు: తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలంగాణ మాజీ సర్పంచ్ల సంక్షేమ సంఘం ప్రకటించింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర పంచాయతీ సర్పంచ్ల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సౌధాని భూమన్న యాదవ్, మాజీ సర్పంచ్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొడ్డు దేవయ్య మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రభుత్వం పెన్షన్ ఇస్తోందని, తమకు కూడా నెలకు రూ.10 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వయం ఉపాధి కోసం రూ.10 లక్షల రుణ సౌకర్యం కూడా కల్పించాలన్నారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు పరిష్కరించే వారికే తమ మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు.