- ఓటీపీతో లాగిన్.. వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీ, సౌకర్యాల లేమి.. వంటి సమస్యలు ఏమైనా ఉంటే ఇకపై పేరెంట్స్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. తమ ఇంటి నుంచే నేరుగా విద్యాశాఖకు ఫిర్యాదు చేసేలా ప్రభుత్వం సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ‘ఆన్లైన్ ప్రైవేట్ స్కూల్ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్’(పీఎస్సీఎఎస్) పేరుతో ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించింది. ప్రైవేట్ స్కూళ్ల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు, బాధితుల విన్నపాలను త్వరగా పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రకటించారు.
ఫిర్యాదు ఇలా..
పేరెంట్స్, స్టూడెంట్లతోపాటు సామాన్య ప్రజలు ఎవరైనా ప్రైవేట్ స్కూళ్లపై ఉన్న ఫిర్యాదులను ఈ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ వెబ్సైట్ https://schooledu.telangana.gov.in లోకి వెళ్లి ‘ఆన్ లైన్ సర్వీసెస్’ సెక్షన్లో పీఎస్సీఎంఎస్ లింక్ క్లిక్ చేస్తే అక్కడ తమ మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే ఒక ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగిన్ అయ్యి తమ సమస్యను వివరంగా రాసి, అవసరమైన డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయొచ్చు.
స్టేటస్ తెలుసుకోవచ్చు..
ఫిర్యాదు చేసిన తర్వాత దాని పరిస్థితి ఏంటనేది కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే వెసులుబాటును స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్కల్పించింది. కంప్లైంట్ ఇచ్చినప్పుడు వచ్చే ‘గ్రీవెన్స్ ఐడీ’ లేదా రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ద్వారా స్టేటస్ను ట్రాక్ చేయొచ్చు. సంబంధిత అధికారులు ఆ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. విచారణ ఏ స్టేజీలో ఉంది? అనేది పారదర్శకంగా వెబ్సైట్లోనే కనిపిస్తుంది.
జవాబుదారీతనం పెంచేందుకే..
స్కూళ్లపై వచ్చే ఫిర్యాదులను త్వరగా మానిటర్ చేయడమే తమ లక్ష్యమని నవీన్ నికోలస్ ప్రకటించారు. ఈ ఆన్లైన్ మెకానిజంతో అధికారులు, స్కూల్ యాజమాన్యాల్లోనూ జవాబుదారీతనం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
