
- ఏడాదిలో పూర్తి కావాల్సింది.. మూడేండ్లు పట్టింది
- పైకి మస్తు కనిపిస్తున్నా లోపలేమీ లేదంటున్న ఉద్యోగులు
- ఆఫీస్ వర్క్ స్పేస్ చిన్నగా ఉందని అసంతృప్తి
హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియెట్ ప్రారంభానికి సిద్ధమైంది. ఆదివారం ఓపెనింగ్ కానుంది. ఏడాదిలోనే పూర్తి కావాల్సిన సెక్రటేరియెట్.. దాదాపు మూడేండ్ల తర్వాత అందుబాటులోకి వస్తోంది. పనులు అంతకంతకు ఆలస్యం అయినట్లే.. నిర్మాణ ఖర్చు కూడా పెరుగుతూ పోయింది. అంచనాకు నాలుగు రెట్లు పెరిగింది. సెక్రటేరియెట్ నిర్మాణానికి రూ.400 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. 2020లో బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు. తర్వాత టెండర్ల టైమ్లో ఈ మొత్తాన్ని రూ.494 కోట్లకు పెంచారు. దీనికంటే 4 శాతం ఎక్కువకు షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ రూ.514 కోట్లకు కోట్ చేసి టెండర్ దక్కించుకుంది. మళ్లీ ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ అంచనాలనూ పెంచారు. ఒక ఫ్లోర్ పెరిగిందని, ఇంకో లక్ష చదరపు అడుగులకు రూ.219 కోట్లు ఖర్చు అవుతుందంటూ నిర్మాణ వ్యయాన్ని రూ.619 కోట్లకు పెంచి బడ్జెట్ కేటాయింపులు చేశారు. అనంతరం ధరలు పెరిగాయని, కరోనా పేరుతో నిర్మాణ ఖర్చును రూ.800 కోట్లకు పెంచారు. పనులు ఆలస్యం కావడంతో అదికాస్తా రూ.1,200 కోట్లకు చేరింది. ఇప్పుడు పనులన్నీ పూర్తయ్యే నాటికి సెక్రటేరియెట్ నిర్మాణ ఖర్చు మొ త్తం రూ.1,600 కోట్లకు చేరిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు గత రెండు బడ్జెట్లలో నిధుల కేటాయింపు కూడా జరిగిందని చెప్పారు.
బయటనే టిప్ టాప్.. లోపల అంతంతే
కొత్త సెక్రటేరియెట్ బయట నుంచి రాజభవనంలా కనిపిస్తున్నప్పటికీ, లోపల పెద్దగేమీ లేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, సీఎంఓ ఉండే ఆరో ఫ్లోర్ మాత్రమే అద్భుతంగా తీర్చిదిద్దారని, అక్కడే అన్ని హైటెక్ హంగులు కల్పించారని అంటున్నారు. మంత్రులు, స్పెషల్ సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, అడిషనల్ సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారుల ఆఫీసుల్లో వర్క్ స్పేస్ పెద్దగా లేదని చెబుతున్నారు. వర్క్ స్పేస్ సరిగా లేకపోతే ఇన్ని వందల కోట్లు పెట్టి పెద్ద బిల్డింగ్ కట్టి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు.
ఆహా అనేలా ఆరో ఫ్లోర్..
సెక్రటేరియేట్లోని చివరి అంతస్తు (ఆరో ఫ్లోర్)లో సీఎం, సీఎంఓ మొత్తం కొలువుదీరనుంది. ఈ ఫ్లోర్ మొత్తం కేసీఆర్ అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దారు. విశాలమైన ఆఫీసులు ఇవ్వడంతో పాటు కంప్లీట్ బుల్లెట్ ప్రూఫ్ ఫ్లోర్గా మార్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన చైర్స్, సోఫాలు ఇతరత్రా ఫర్నిచర్ వంటివన్నీ కలిపితే రూ.10 కోట్లకు పైనే ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇక్కడ సీఎం కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. మొన్నటి వరకు ఆరు ఫ్లోర్లు మాత్రమే వర్క్ స్పేస్ అనుకోగా.. ఇప్పుడు గ్రౌండ్ఫ్లోర్, లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా యాడ్ అయింది. దీంతో మొత్తం ఎనిమిది అంతస్తుల్లో సెక్రటేరియెట్ఉండనుంది.
2020 అక్టోబర్లో టెండర్లు..
కొత్త సెక్రటేరియేట్నిర్మాణానికి 2020 అక్టోబర్లో టెండర్లు పిలవగా, షాపూర్జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది. ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, కరోనాతో కూలీలు ఇంటికి వెళ్లడంతో పనులు నిలిచిపోయాయి. ఆ తరువాత డిజైన్లలో మార్పులు చేయడం, రెడ్స్టోన్, ఎలివేషన్, టైల్స్ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడం, సర్కార్ అప్పటికప్పుడు మార్పులు సూచించడంతో పనులు మరింత ఆలస్యమయ్యాయి.
ఓపెనింగ్కు భారీ బందోబస్తు..
సెక్రటేరియెట్ ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెక్రటేరియెట్ చుట్టూ మూడంచెల భద్రత, 300 సీసీ కెమెరాలతో నిఘా పెంచారు. భద్రత ఏర్పాట్లను డీజీపీ అంజనీకుమార్ శుక్రవారం పర్యవేక్షించారు. టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీ స్వాతిలక్రా, లా అండ్ ఆర్డర్ ఏడీజీ సంజయ్ జైన్, సీపీ సీవీ ఆనంద్తో కలిసి ఆయన సెక్రటేరియెట్ అంతా తిరిగి పరిశీలించారు. ప్రారంభోత్సవం తర్వాత సభ నిర్వహించనుండగా.. అన్నిచోట్ల సెక్యూరిటీ ఏర్పాట్లపై సమీక్షించారు.