
హైదరాబాద్, వెలుగు: పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలోని డీబ్లాక్లో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. మార్చి16 నుంచి ఏప్రిల్ 3 వరకూ టెన్త్ పరీక్షలు జరగ్గా.. 11,023 స్కూళ్ల నుంచి 5,52,302 మంది స్టూడెంట్లు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల విడుదలలో గందరగోళం చెలరేగిన నేపథ్యంలో అధికారులు టెన్త్ ఫలితాల విడుదలపై పలు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. టెన్త్ విద్యార్థులకు 9,10 తేదీల్లో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. సోమవారం హెడ్మాస్టర్లు స్కూళ్లకు వెళ్లి ఫలితాలు చూడాలని ఆదేశించారు. హెడ్మాస్టర్లు స్కూల్ లాగిన్ ద్వారా ఒకేసారి మొత్తం స్టూడెంట్స్ రిజల్ట్స్ను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. స్కూల్ లాగిన్ ద్వారా రిజల్ట్స్ చూసేందుకు, www.bse.telangana.gov.in వెబ్సైట్లోకి వెళ్లి, స్కూల్ వైజ్ లాగిన్ సెలెక్ట్ చేసుకోవాలి. యూజర్ ఐడీ: ఎస్ఎస్సీ కోడ్, పాస్వర్డ్: ఎస్ఎస్సీ కోడ్ ఎంటర్ చేస్తే విద్యార్థుల రిజల్ట్స్ కన్పిస్తాయి. కాగా, ‘టీఎస్ఎస్ఎస్సీ బోర్డు’యాప్ను ప్రభుత్వ పరీక్షల విభాగం ఆదివారం విడుదల చేసింది. దీనిద్వారా టెన్త్ ఫలితాలు చూడటంతోపాటు ఫిర్యాదులు చేయవచ్చు. ఫలితాలను www.bse.telangana.gov.in, www.v6velugu.com లోనూ చూడవచ్చు.