సికింద్రాబాద్-ప్యారడైజ్ నుంచి బోయిన్ పల్లి వరకు భారీ ఫ్లైఓవర్

సికింద్రాబాద్-ప్యారడైజ్ నుంచి బోయిన్ పల్లి వరకు భారీ ఫ్లైఓవర్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: సికింద్రాబాద్-ప్యారడైజ్ నుంచి బోయిన్ పల్లి వరకు భారీ ఫ్లైఓవర్ ( ఎలివేటేడ్ కారిడార్) నిర్మించనున్నారు. హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎలివేటెడ్ కారిడార్ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. ప్యారడైజ్ నుంచి బోయినపల్లి డెయిరీ ఫామ్ వరకు నిర్మించే మొదటి కారిడార్​లో భాగంగా భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు. మూడు నెలల్లోపు పరీక్షలు పూర్తి చేసి వాటి ఆధారంగా పిల్లర్లను నిర్మించనున్నారు. ఈ పనులతో పాటే భూసేకరణ కూడా కొనసాగించనున్నారు. ఈ ప్రాజెక్టుకు డిఫెన్స్​కు చెందిన 113.48 ఎకరాల భూములు అవసరం కాగా.. ఇటీవలే డిఫెన్స్​తో భూబదలాయింపు విషయంలో అంగీకారం కుదిరింది. 

ఇదే మొదటి కారిడార్​

హైదరాబాద్ లో నేషనల్ హైవే 44పై రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్​ఇబ్బందులు తప్పించడానికి ఈ కారిడార్​ను ప్యారడైజ్​నుంచి తాడ్ బండ్​ మీదుగా బోయిన్​పల్లి డెయిరీఫామ్​వరకూ 5.4 కి.మీ. మేర నిర్మించనున్నారు. ఈ కారిడార్​లో బేగంపేట ఎయిర్​పోర్ట్​రావడంతో బాలంరాయ్ వద్ద 600 మీటర్ల అండర్ గ్రౌండ్ టన్నెల్​నిర్మించనున్నారు. దీనికోసం ఎయిర్​పోర్ట్​అథారిటీ నుంచి పర్మిషన్​ కూడా తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 1550  కోట్లు ఖర్చు చేయనున్నారు. 

 త్వరలోనే రెండో కారిడార్​లో కూడా..

రెండో కారిడార్​అయిన జేబీఎస్​నుంచి శామీర్​పేట వద్ద ఔటర్ ను కలుపుతూ నిర్మించే పనులు కూడా త్వరలో చేపట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 18 కి.మీ. మేర నిర్మించే ఈ ఎలివేటెడ్​ కారిడార్ ను పరిహారంతో కలిపి  పూర్తి చేయడానికి దాదాపు 2వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో భాగంగా హకీంపేట ఎయిర్​ఫోర్స్​ ట్రైనింగ్​సెంటర్​ వద్ద 500 మీటర్ల అండర్​ గ్రౌండ్​ టన్నెల్​ కట్టనున్నారు. ఈ కారిడార్​ పూర్తయితే సికింద్రాబాద్​ నుంచి బొల్లారం మీదుగా శామీర్​పేట నుంచి సిద్దిపేట, కరీంనగర్, గజ్వేల్​తదితర ప్రాంతాలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వెళ్లిపోవచ్చు. డిఫెన్స్​ భూములు ఇవ్వడానికి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో త్వరలోనే ఈరూట్​లో కూడా భూసార పరీక్షలు నిర్వహించి పనులను ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు.

 గోడలు, రిజర్వాయర్ల నిర్మాణం.. 

ఎలివేటెడ్​ కారిడార్ల నిర్మాణం కోసం కంటోన్మెంట్​పరిధిలో దాదాపు 10 కి.మీ మేర ప్రహారీగోడను నిర్మించనున్నారు. భవిష్యత్​లో కారిడార్​ పనులకు ఇబ్బందులు కలగకుండా ఈ గోడను సరిహద్దుగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కొన్ని చోట్ల ఇప్పుడున్న రిజర్వాయర్లు కూల్చాల్సి వస్తుండడంతో అల్వాల్, తిరుమలగిరి ప్రాంతాల్లో రెండు భారీ రిజర్వాయర్లను హెచ్ఎండీఏ నిర్మించి కంటోన్మెంట్​
బోర్డుకు ఇవ్వనున్నది.