
వర్సిటీలకు కేటాయింపులు అంతంతే
నిర్వహణ నిధులే ఎక్కువ.. అభివృద్ధికి ఇచ్చిందేం లేదు
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదీ అరకొర నిధులే కేటాయించింది. నిర్వహణ పద్దు కింద మాత్రమే నిధులను ఎక్కువగా ఇచ్చి, వాటి అభివృద్ధి కోసం ఇచ్చే నిధులపై మొండి చెయ్యి చూపించింది. 8 యూనివర్సిటీలకు రూ.536.36 కోట్ల బడ్జెట్ కేటాయించిన సర్కారు, అందులో నిర్వహణ కోసం ఇచ్చిందే రూ.533.36 కోట్లు. మిగతా రూ.3 కోట్లు మాత్రమే ప్రగతి పద్దు కింద ఇచ్చింది. అది కూడా కేవలం పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకే కేటాయించింది. పోయినేడాది నిర్వహణ పద్దు కింద రూ.480.52 కోట్లు ఇచ్చిన సర్కారు, ఈ సారి కొంచెం పెంచింది. అయితే, నిర్వహణ పద్దు కింద ఇచ్చిన నిధులు ప్రొఫెసర్లు, సిబ్బంది జీతాలకే సరిపోవని అధికారులు వాపోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు వర్సిటీలకు రూట్ క్లియర్ చేసిన సర్కార్, ప్రభుత్వ వర్సిటీలను మాత్రం నిర్లక్ష్యం చేస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రూ.600 కోట్లు అవసరమవుతాయని ఓయూ అధికారులు ప్రతిపాదనలు పంపినా, కేవలం రూ.343.58 కోట్లే సర్కార్ ఇచ్చింది. దీనిపై వర్సిటీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.