బీజేపీ అభ్యర్థి ఎవరు?.. జూబ్లీహిల్స్ బైపోల్ పై చర్చ

బీజేపీ అభ్యర్థి ఎవరు?.. జూబ్లీహిల్స్ బైపోల్ పై చర్చ
  • గతంలో మూడో  స్థానానికే పరిమితమైన కమలం పార్టీ
  • పరిశీలనలో ముగ్గురి పేర్లు
  • ఇక్కడ 1.23 లక్షలు ముస్లింలవే
  • పోటీ చేసినా గెలుపు కష్టమేనా?

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంలో ఈ సెగ్మెంట్ లో ఉప ఎన్నిక అనివార్యమవుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు పార్టీలు అస్త్రాలు సర్దుకుంటున్నాయి.  తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ తరఫున, 2018, 2023లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ మూడు ఎన్నికల్లోనూ బీజేపీ మూడో స్థానానికే పరిమితమైంది. 2009లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందగా..బీజేపీ అభ్యర్థి బాల ప్రకాశ్ ఐదో స్థానంలో నిలిచారు.  2014 లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించలేదు.  పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించింది. అప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఇక్కడ విజయం సాధించారు.  2018 ఎన్నికల్లో  బీజేపీ తరఫున పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి కేవలం 8,557 ఓట్లు సాధించారు. ఆయనకు నాలుగో స్థానం దక్కింది. ఇక్కడి  నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ కన్నా తక్కువ ఓట్లు రావడం గమనార్హం. 2023 ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డి పోటీ చేయగా ఆయనకు 25,866 ఓట్లు వచ్చాయి. 

విజేతను నిర్ణయించేది మైనార్టీలే!

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,94,886 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2,07,932 మహిళలు 1,86,935, ఇతరులు 19 మంది ఉన్నారు. వీరిలో ముస్లింల ఓట్లే 1.23 లక్షలు కావడం గమనార్హం. ఇక్కడి నుంచి గెలవాలంటే తప్పకుండా ముస్లిం ఓట్లు రాబట్టుకోవాల్సి ఉంటుంది. మెజార్టీ  ముస్లింలు బీజేపీకి ఓటేసేందుకు వెనుకాడటం సహజం. ఇక్కడి నుంచి బీజేపీ  అభ్యర్థులుగా పోటీ చేసినవారెవరూ విజయంసాధించలేక పోయారు. కనీసం రెండో స్థానంలో కూడా నిలువలేక పోవడం ఇందుకు నిదర్శనం.  

బరిలో ముగ్గురి పేర్లు!

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకల దీపక్ రెడ్డిని మరో మారు బరిలోకి దించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం. అయితే ఈ స్థానం నుంచి మహిళా నేత కీర్తి రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ కూడా పోటీకి సై అంటున్నారు. అయితే బీజేపీ ఎవరు పోటీ చేసినా గెలుపు అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు.

►ALSO READ | హైదరాబాద్ జనానికి బిగ్ అలర్ట్ : రేపటి నుంచి జూలై 24 వరకు సిటీలో ట్రాఫిక్ డైవర్షన్స్..