మున్సిపల్ ఎన్నికలకోసం అధికారుల కసరత్తు

మున్సిపల్ ఎన్నికలకోసం అధికారుల కసరత్తు

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్​ ఎన్నికలకు లైన్​ క్లియర్​ అవడంతో మున్సిపల్​ కమిషనర్లు, సిబ్బంది బిజీబిజీ అయిపోయారు. సర్కారు నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే వార్డుల డీలిమిటేషన్​, పోలింగ్​ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. సోమవారం నుంచి ఆ పనులను ప్రారంభించే అవకాశమున్నట్టు అధికారులు చెబుతున్నారు. కోర్టు తీర్పు కాపీ శనివారమే అందుతుందని భావించిన అధికారులు ప్రభుత్వం నుంచి ఆదే శాలు వస్తాయని ఎదురుచూశారు. అయితే, కోర్టు తీర్పు కాపీ సర్కారుకు అందకపోవడంతో డీలిమిటేషన్​పై సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే, కోర్టు ఆదేశాలతో డీలిమిటేషన్​కు తీసుకోవాల్సిన చర్య లపై అధికారులు ఇప్పటికే కసరత్తులు చేస్తున్నారు. శనివారం వార్డుల వారీగా వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అధికారులు, మళ్లీ లీగల్​ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై చర్చించారు.

డీలిమిటేషన్​ అన్నింటికా? కొన్నింటికా?

వార్డుల పునర్విభజన ప్రక్రియను 14 రోజుల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపైనే మున్సిపల్​ అధికారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీర్​పేట కార్పొరేషన్​కూ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే లీగల్​ సమస్యలు లేని మున్సిపాలిటీల్లోనూ మళ్లీ డీ లిమిటేషన్​ చేయాలని సర్కారు ఆదేశిస్తే, అందుకు సిద్ధంగా ఉండాలంటూ కమిషనర్లకు సమాచారం వెల్లినట్టు తెలుస్తోంది. స్టేలు ఎత్తేసిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకే డీలిమిటేషన్​ను పరిమితం చేస్తే, న్యాయ వివాదాలు లేని మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా పోలింగ్​ స్టేషన్ల గుర్తింపు, ఇతర పనులు పూర్తి చేసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. పోలింగ్​ స్టేషన్లపై అధికారికంగా సమాచారం ఇవ్వాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆయా మున్సిపల్​ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది.

ఒత్తిడిలోనే తప్పిదాలు

జులైలో చేసిన వార్డుల విభజన ప్రక్రియలో మున్సిపల్​ అధికారులపై ఒత్తిడి ఎక్కువగా ఉండటంతోనే తప్పులు జరిగినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వీలైనంత వరకు అందరినీ మెప్పించేలా డీలిమిటేషన్​ చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు 14 రోజుల గడువు ఇచ్చినా మొదటి వారంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారు. మిగతా వారం రోజుల్లో వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ తర్వాతే సీడీఎంఏకు డీలిమిటేషన్​ వివరాలను అందించాలని భావిస్తున్నారు.