
- పెండింగ్ బిల్లులతో పాటు కొత్త అప్లికేషన్లూ క్లియర్
హైదరాబాద్, వెలుగు: కల్యాణలక్ష్మి స్కీమ్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,225.43 కోట్లు రిలీజ్చేసింది. ఇటీవల బడ్జెట్ లో కల్యాణలక్ష్మి స్కీమ్కు రూ. 2,175 కోట్లు కేటాయించగా.. అందులో రూ.1,225.43 కోట్లు రిలీజ్ చేసినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లతో పాటు కొత్తగా అప్లై చేసుకున్న లబ్ధిదారులకు కూడా నిధులు విడుదల చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం కృతజ్ఞతలు తెలిపారు. కల్యాణలక్ష్మి కోసం ఇప్పటి వరకు మొత్తం 65,026 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 33,558 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ ఏడాది మార్చి 31 వరకు 31,468 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి గుర్తుచేశారు.
పెండింగ్ అప్లికేషన్లు క్లియర్ చేయడంతో పాటు కొత్త అప్లికేషన్లలో 24,038 అప్లికేషన్లకు ఫండ్స్ రిలీజ్ చేశామన్నారు. ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కల్యాణలక్ష్మి స్కీంకు ఫండ్స్ రిలీజ్ చేయడం పేదల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.