నేషనల్ పబ్లిక్ బస్ ట్రాన్స్ పోర్ట్ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం న్యూఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ అవార్డులను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) ప్రతి ఏటా ఈ అవార్డులను ప్రధానం చేస్తుంది. 2022- -23 ఏడాదికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం, తదితర కేటగిరిల్లో ఈ జాతీయ స్థాయి పురస్కారాలు టీఎస్ఆర్టీసీకి దక్కాయి. న్యూఢిల్లీలోని ఇండియా హబిటెట్ సెంటర్ లో శుక్రవారం సాయంత్రం జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఏఎస్ఆర్టీయూ అధ్యక్షులు, కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ కార్యదర్శి శ్రీ అనురాగ్ జైన్, ఐఏఎస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ప్రతిష్టాత్మకమైన 5 జాతీయ స్థాయి అవార్డులు టీఎస్ ఆర్టీసీకి దక్కడం సంస్థకు ఎంతో గర్వకారణమని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాలతో టీఎస్ఆర్టీసీ ఖ్యాతి మరింత పెరిగిందని అన్నారు. సిబ్బంది నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయడం వల్లే సంస్థకు ఈ పురస్కారాలు వచ్చాయని పేర్కొన్నారు. అవార్డులు వచ్చేలా కృషిచేసిన 43 వేల టీఎస్ఆర్టీసీ కుటుంబ సభ్యులకు ఈ పురస్కారాలను అంకితం చేస్తున్నట్లు సజ్జనర్ ప్రకటించారు.