హైదరాబాద్, వెలుగు: దేవాదాయ శాఖలో డిజిటల్పరిపాలనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. సామాన్య భక్తులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఆమె స్పష్టం చేశారు. ఆలయాల పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేలా అమలు చేస్తున్న టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (టామ్స్), యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుకు సంబంధించిన ‘తెలంగాణ ధార్మిక, హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయాల (సవరణ) చట్టం-2025’ ముసాయిదా నియమావళి (డ్రాఫ్ట్ రూల్స్)పై బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట ఈవో భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని దేవాలయాల పరిపాలనను సంపూర్ణంగా డిజిటలీకరించే దిశగా ‘టామ్స్’లో రూపొందించిన వివిధ మాడ్యూళ్ల పనితీరును మంత్రి సురేఖ పరిశీలించారు. ఆలయ ఆస్తులు, భూముల రక్షణ, ఆదాయ వ్యయాల నమోదు, ఈ-ఆఫీస్ విధానం, భక్తులకు అందించే సేవలను మరింత వేగవంతం చేసేందుకు ఈ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
