సీఎం జగన్‌ను కలిసిన తెలుగు సినీ నిర్మాతలు

సీఎం జగన్‌ను కలిసిన తెలుగు సినీ నిర్మాతలు

అమరావతి : తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతల బృందం ఇవాళ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసింది.  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీతో పాటు నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్‌రెడ్డి, జెమిని కిరణ్‌ లు సీఎం ను కలిసారు.

సీఎం తో జరిగిన భేటిలో హుథ్‌ హుథ్‌ తుఫాను సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితుల కోసం సినీపరిశ్రమ సాయంతో 320 ఇళ్లు నిర్మించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తైనందున వాటిని ప్రారంభించి హుథ్‌హుథ్‌ సమయంలో ఇళ్లు కోల్పోయిన వారికి అందించాలని విజ్ఞప్తి చేశామన్నారు.

తెలుగు సినీపరిశ్రమంతా రెండు రోజుల పాటు అన్ని కార్యక్రమాలు నిలిపివేసి, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు టెలీథాన్‌ పేరుతో ప్రత్యేక షో నిర్వహించామని చెప్పారు. ఆ షో నిర్వహణ ద్వారా వచ్చిన రూ.15 కోట్లతో ఈ ప్రాజెక్టును  చేపట్టామని చెప్పారు. ఆ ఇళ్ల నిర్మాణం ఇప్పుడు పూర్తైందని.. అదే విషయాన్ని  ముఖ్యమంత్రికి  వివరించామని చెప్పారు. పూర్తైన ఇళ్లను  పేదలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని, అందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.