గండిపేట్,వెలుగు: చరిత్రలో వేద సంస్కృతి అతి ప్రాచీనమైనదని, తొలి భాష సంస్కృతం కాగా.. ఆ తర్వాత లోకానికి చేరిన భాష తెలుగు అని త్రిదండి చినజీయర్ స్వామి పేర్కొన్నారు. ఆదివారం గండిపేట మండలం నార్సింగిలోని ఓం కన్వెన్షన్లో తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చినజీయర్ స్వామి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మిజోరం గవర్నర్ హరిబాబు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, ప్రముఖ నాట్యకారిణి కళాకృష్ణ, సంపత్కుమార్లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. గ్రంథాలకే పరిమితం కాకుండా సామాన్య ప్రజల్లో గుర్తింపు పొందుతున్న భాష తెలుగు అని.. ప్రామాణికంగా చెప్పవచ్చునన్నారు. తెలుగు వాడిగా పుట్టడడం మామూలు విషయం కాదని ఎంతో మంది చెప్పారని ఆయన అన్నారు. అంత గొప్ప తెలుగును కాపాడుకునే కార్యక్రమాలు చేయడం బాధగా అనిపిస్తుందన్నారు. దేశభాషలందు తెలుగు లెస్సా అనే నానుడికి శ్రీకారం చుట్టారన్నారు.
తెలుగును చెప్పే పాఠశాలలు లేవన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీద ప్రేమ తగ్గిపోయేలా ప్రవర్తిస్తున్నారన్నారు. తెలుగు వారు ఆరాధించినంతగా రాముడిని మరెవ్వరు ఆరాధించలేరన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ నేత, పార్టీ మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు.