జూలైలో షూటింగ్స్ రీస్టార్ట్

జూలైలో షూటింగ్స్ రీస్టార్ట్

కోవిడ్ సెకెండ్ వేవ్‌‌తో ఆగిపోయిన సినిమా షూటింగ్స్‌‌లో కొన్ని లాక్‌‌డౌన్ సడలింపుల తర్వాత మొదలయ్యాయి. వాటిలో నితిన్ 'మ్యాస్ట్రో' షూటింగ్ పూర్తయింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తీస్తున్న 'ఆర్ఆర్ఆర్' టాకీ పార్ట్ కంప్లీట్ అయింది. పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. మరికొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఇప్పుడు పలువురు టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ జులై నుండి తమ సినిమాలను రీస్టార్ట్ చేస్తున్నారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ తీస్తున్న 'ఆచార్య' ఈ నెల మొదటి వారంలో సెట్స్‌‌కి వెళ్లబోతోంది. కీలకపాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ కూడా రెండు రోజుల పాటు షూటింగ్‌‌లో పాల్గొనబోతున్నాడు. ఇరవై రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇక బాలకృష్ణతో బోయపాటి తీస్తున్న 'అఖండ' సెకెండ్ వీక్‌‌లో సెట్స్‌‌కి వెళ్లనుంది. రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాల్లోని చారిత్రక ప్రాంతాల్లో ఈ షూటింగ్ జరగనుంది. ఇరవై రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌‌తో షూటింగ్ పూర్తి కానుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తీస్తున్న 'ఎఫ్ 3' సినిమా షూటింగ్ జులై ఫస్ట్ నుండి హైదరాబాద్‌‌లోని వివిధ ప్రాంతాల్లో జరగనుంది. పదిరోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌‌లో ఇద్దరు హీరోలతో పాటు తమన్నా, మెహరీన్, సునీల్ పాల్గొనబోతున్నారు. ఇక అల్లు అర్జున్‌‌తో సుకుమార్ తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ 'పుష్ప' జులై ఐదు నుండి హైదరాబాద్‌‌లో తిరిగి సెట్స్‌‌కి వెళ్లనుంది. రవితేజ హీరోగా శరత్ మండవ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండే స్టార్ట్ అవుతోంది. గుణశేఖర్ తీస్తున్న 'శాకుంతలం' సెట్స్‌‌లో సమంత ఈరోజే జాయిన్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా రూపొందుతున్న 'బీస్ట్' సినిమా షూటింగ్ ఈరోజే స్టార్ట్ అవుతోంది. విజయ్, పూజా హెగ్డే జంటపై ఓ పాటని చిత్రీకరించనున్నారు. మరో కోలీవుడ్ స్టార్ అజిత్ నటిస్తున్న 'వలిమై' చిత్రం కూడా జులైలోనే సెట్స్‌‌కి వెళ్లబోతోంది. మొత్తానికి ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ స్టార్స్ సినిమాల్లో ఎక్కువభాగం జులైలో రీస్టార్ట్ అవుతున్నాయి. థర్డ్ వేవ్ రాబోతోందనే టాక్‌‌తో వీలయినంత త్వరగా బ్యాలెన్స్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసేందుకు ఫిల్మ్ మేకర్స్ పక్కా ప్లానింగ్​తో  ముందుకెళ్తున్నారు.