- మహిళలపై వివక్ష పోవాలి
- రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ పార్థసారథి
బషీర్బాగ్, వెలుగు: రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్లో అంగ, అర్ధ బల ప్రభావం ఎక్కువ ఉంటుందని, పురుషుల డామినేషన్ వల్ల మహిళలు స్వతంత్రంగా పోటీ చేయలేకపోతున్నారని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ సి.పార్థసారథి అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కినప్పటికీ పురుషాధిక్యమే కనిపిస్తోందన్నారు.
మహిళా నాయకత్వంపై వివక్ష పోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఎక్సెల్ ఇండియా మ్యాగజైన్ ఆధ్వర్యంలో ‘పబ్లిక్ లైఫ్ లో మహిళ నాయకత్వం’ అంశంపై సెమినార్ నిర్వహించగా ఆయన గెస్ట్గా హాజరయ్యారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం 15 శాతం దాటకపోవడం బాధాకరమన్నారు.
సినిమా రంగంలో కూడా మహిళలను గ్లామర్ పాత్రల కోసమే వాడుకుంటున్నారని, పురుషులతో సమానంగా పారితోషకం కూడా ఇవ్వడం లేదన్నారు. పురుషులు స్త్రీలను తమ ఇంటి నుంచి గౌరవించడం మొదలు పెట్టాలని, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. కేశవ మెమోరియల్ లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అక్కపెద్ది వాణి, న్యాయవాది శ్రీదేవి గాదె, ఎక్సెల్ ఇండియా న్యూస్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ రామకృష్ణ సంగేమ్, విమెన్ యాక్టివిస్ట్ శోభారాణి, డాక్టర్ అజిత సురభి, సుధాకర్ గండే, భాస్కర్ తాటికొండ, విద్యార్థినులు పాల్గొన్నారు.
