
జైపూర్: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్)లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టాలన్స్ 40–38తో గోల్డెన్ ఈగల్స్ యూపీపై గెలిచింది. తెలుగు టీమ్ ఆరంభంలో కాస్త నెమ్మదించడంతో 5–6, 6–7, 12–13, 14–17తో వెనకబడింది. అయితే ఫస్ట్ హాఫ్ చివర్లో పుంజుకున్న తెలుగు టాలన్స్ ప్లేయర్లు దేవిందర్ సింగ్ భల్లార్, అనిల్, రఘు, విశాల్ వరుస పాయింట్లతో హోరెత్తించారు.
ఫలితంగా 18–18తో స్కోరు సమం చేసిన టాలన్స్ అక్కడి నుంచి పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 21–19తో ఫస్ట్ హాఫ్ను ముగించి తెలుగు టీమ్ తర్వాత 25–21, 27–23తో లీడ్లో నిలిచింది. చివర్లో యూపీ పెనాల్టీలతో మూడు గోల్స్ కొట్టినా ఆఖర్లో తెలుగు టాలన్స్ సూపర్ ఫినిషింగ్తో ఆకట్టుకుంది. దేవిందర్కు ‘గోల్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.