
పురాణాల్లో దైవ వృక్షంగా పేరున్న నారేప మంచిర్యాల జిల్లా అడవుల్లో చాలా ఫేమస్. వీటి గురించి చెప్పుకోవాలంటే... ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి.
ఎంత పెద్ద గుడి అయినా సరే.. ఎదురుగా దానికంటే ఎత్తైన ధ్వజ స్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం ముట్టుకుని, మొక్కుకున్న తర్వాతే భక్తులు గుళ్లోకి అడుగు పెడతారు. మరి చూడగానే మొక్కాలనిపించే ఈ ధ్వజస్తంభాన్ని దేనితో తయారు చేస్తారని ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని చోట్ల రాయితో చేస్తారు. కానీ, ఎక్కువ చోట్ల చెక్కతో చేసిన ధ్వజ స్తంభమే కనిపిస్తుంది.
వందల ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఉండే ఈ ధ్వజ స్తంభాన్ని నారేప చెట్టు కాండంతో తయారు చేస్తారు. ఆలయం అనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ద్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు. గుళ్లో మూలవిరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం. గుడికి వెళ్లిన భక్తులు దేవుడి కంటే ముందుగా దర్శించుకునేది ద్వజస్తంభాన్నే! ఎత్తైన ధ్వజస్తంభం అంతరిక్షంలో ఉన్న దైవశక్తులను ఆహ్వా నిస్తుందని, భూలోకానికి స్వర్గలోకానికి మధ్య వారధిగా నిలుస్తుందని నమ్ముతారు.
ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ధ్వజస్తంభాన్ని ఏదో ఒక చెట్టుతో తయారు చేశామన్నట్లు చేయరు. దీనికి కేవలం నారేప వృక్షాలు మాత్రమే ఉపయోగి స్తారు. రోజూ గుడికి వెళ్లి మొక్కేవాళ్లలో ఈ ధ్వజస్తంభం నారేప చెట్టుదని చాలామందికి తెలియదు. చేవ కలిగి వందల ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండటం వారేప కలప ప్రత్యేకత. ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లు నిటారుగా 50 మీటర్లకు పైగా పెరిగే ఈ వృక్షాలు. మంచిర్యాల జిల్లాలోని కుశ్నపల్లి, నీల్వాయి, చెన్నూర్ రేంజీల్లో మాత్రమే కనిపిస్తాయి.
గొడ్డలికి వినదు
దాదాపు అన్ని ప్రముఖ దైవ క్షేత్రాల్లో నారేప ధ్వజస్తంభాలే పూజలు అందుకుంటున్నాయి.. మంచిర్యాల జిల్లాలోని ప్రాణహిత, గోదావరి పరి వాహక ప్రాంత అడవులో వందల ఏళ్ల వయసు గల నారేప చెట్లు కనిపిస్తాయి. చిన్న ఆకులతో.. మూడు మీటర్ల మందంతో 50మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. నిటారుగా ఎత్తు పెరగడంలో వీటికి ఇంకే చెట్లు సాటి రావు.
అటవీ ప్రాంతాల ప్రజలు వంట చెరుకు కోసం ఇతర చెట్లను నరికినా.. నారేప చెట్ల జోలికి మాత్రం పోరు. ఈ కలప నారతో కూడి చాలా గట్టిగా ఉంటుంది. 'నారేపకు గొడ్డలే మర్లబడుతుంది' అని అడవుల్లో కట్టెలు కొట్టేవాళ్లు అంటారు. దీంతో అడవుల్లో, మైదాన ప్రాంతాల్లో ఏచెట్టు కానరాకపోయినా వందల ఏళ్ల వయసున్న నారేప చెట్లు మాత్రం ఎక్కువగా కనిపిస్తాయి.
ప్రాణహిత తీరం వెంట ఈ నారేప చెట్లు ఎక్కువగా పెరగడం మరో ప్రత్యేకత! ప్రాణహిత మొదలైన కొమ్రంభీం జిల్లా తమ్మిడిహట్టి నుంచి మొదలు వేమనపల్లి, -చెన్నూర్, బెజ్జూర్, నెన్నెలతో పాటు పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతా లలో వీటి ఎదుగుదల ఎక్కువగా ఉన్నదని ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తించారు.
ఎక్కడ గుడి కట్టినా...
నారేప అంటే దైవ వృక్షమని నమ్మకం.అందుకే దేవాలయాల ముందు ధ్వజస్తంభం పెట్టేందుకు కేవలం నారేప చెట్టును మాత్రమే వాడతారు. పల్లె, పట్టణం ఎక్కడ గుడి కట్టాలన్నా ముందుగా నా రేప చెట్టు జాడ కోసం వెతుకుతారు. గుడిలో మూల విరాట్టుని, ధ్వజస్తంభాన్నిఒక్క సారి ప్రతిష్ఠించారంటే తిరిగి మార్చడం ఉండదు. అందుకే ఈరెండింటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అంత పవిత్రంగా, గట్టిగా ఉంటుందనే నమ్మకంతో పూర్వీకులు అప్పట్లోనే దీని విశేషాన్ని గుర్తించి ధ్వజస్తంభం గా పెట్టేందుకు నిర్ణయించారు. అదే అనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది.
అనుమతి ఉందా
గుడి కడుతున్నాం కదా! అని నేరుగా అడవి లోకి వెళ్లి ఈ చెట్టుని నరికి తెస్తామంటే కేసు అవుతుంది. ఈ చెట్టును నరికి తెచ్చుకోవాలంటే ఫారెస్ట్ అధికారుల అనుమతి తీసుకోవాలి. దర ఖాస్తును బట్టి నరకాల్సిన చెట్టును గుర్తించి దాని రేటు నిర్ణయించి డీడీగా కట్టాలని ఫారెస్ట్ అధికారులు చెప్తారు. ఒకవేళ అనుమతి లేకుండా చెట్టు నరికితే కేసు పెట్టి ఫైన్ వేస్తారు.
ధ్వజస్తంభానికి నారేపనే శ్రేష్ఠం..
దేవుడి తర్వాత గుడికి ముఖ్యమైంది ధ్వజస్తంభం, గుడిలో ఉండే మూల విరాట్టు, ధ్వజస్తంభం ఎంపికలో చాలా జాగ్రత్తలు పాటించి నియమ, నిష్టలతో పని చేస్తారు. నారేప చెట్టే ధ్వజస్తంభానికి శ్రేష్టమైంది. ధ్వజస్తంభం కోసం నారేప చెట్టును గుర్తించి దానిపై ఎలాంటి పక్షి నివాసాలు లేకుండా ఉన్నదాన్ని, అగ్నికి కాలిపోని దాన్ని ఎంపిక చేసి నరుకుతారు. ఆ తర్వాత దాన్ని చెక్కి ఆలయానికి చేరుస్తారు. ధ్వజస్తంభంగా రూపుదిద్దాక ఆ ధ్వజస్తంభంలోకి దైవశక్తిని ప్రతిష్ఠింపజేయడానికి పూజలు చేస్తారు. దానినే ధ్వజప్రతిష్ట అంటారు. ధ్వజప్రతిష్ట నిర్వహించడం వల్ల ధ్వజంలోకి దేవతాశక్తి ఆవాహన జరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి..
చాలా స్పెషల్ చెట్లు
నారేప చెట్టు శాస్త్రీయ నామం- హాడ్విక్యాబైనైటా. ఇది చాలా గట్టి చెట్టు.ప్రాణహిత తీరంలో ఎక్కువగా నీటి ఎదుగుదల ఉంది. వీటిని కాపాడేందుకు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ నుంచి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. సాధారణంగా ప్రజలు కూడా ఇంటి అవసరాల కోసం ఈ చెట్టును కొట్టరు. ఈ చెట్లను ఫారెస్ట్ లో చూసినప్పుడు చాలా స్పెషల్ గా కనిపిస్తాయి.
బాడిశలే పనిచేయవు..
నారేప చెట్లు చాలా గట్టిగా ఉంటాయి. ఇనుమును చెక్కినట్టే అనిపిస్తుంది. ధ్వజస్తంభం చిక్కే పని చేయాలంటే ఐదు నుంచి ఆరు బాడిశలు దగ్గర పెట్టుకోవాలి. పది రోజులు చెక్కినా.. దాని బెరడు తీయలేం. అయితే దేవుడి కోసం చేస్తున్నాం అనే భావనతో ఎంత కష్టమైనా వీటి చెక్కుతారు. ఇలా ధ్వజస్థంభం తయారు చేసిన వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది..