- ఉప ఎన్నికలతో గవర్నర్ దగ్గర ఆగిన క్షమాభిక్ష ఫైల్
హైదరాబాద్, వెలుగు: ఏండ్ల తరబడి క్షమాభిక్ష కోసం ఎదురు చూస్తున్న జీవిత ఖైదీల విడుదలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపిన క్షమాభిక్ష ఫైల్.. దుబ్బాక ఉప ఎన్నికలతో అక్కడే ఆగిపోయింది. దీనిపై ఈసీ అనుమతి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి గవర్నర్ ఆఫీసు సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈసీ అనుమతి తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెబుతున్నారు. క్షమాభిక్షకు సంబంధించిన గైడ్లైన్స్తో పాటు దుబ్బాక నియోజకవర్గానికి చెందిన అర్హులైన ఖైదీల ఫైల్నూ ఈసీకి అందించనున్నట్టు సమాచారం. గాంధీ జయంతి సందర్భంగా 143 మంది అర్హులైన ఖైదీలతో కూడిన ఫైల్ను పోయిన నెల 29న సీఎం వద్దకు హోంశాఖ పంపించింది. అక్కడి నుంచి గవర్నర్ ఆమోదం కోసం ఆ ఫైల్ను పంపారు.