- 30% హైదరాబాద్లోనే..
- డెలివరీ, ప్యాకేజింగ్, వేర్హౌస్ మేనేజ్మెంట్, కాల్ సెంటర్ వంటి సెగ్మెంట్లలో హైరింగ్
- దేశం మొత్తం మీద ఏడు లక్షల టెంపరరీ జాబ్స్
హైదరాబాద్, వెలుగు: పండుగ సీజన్ మొదలుకానుండడంతో ఈ–కామర్స్ సెక్టార్లో టెంపరరీ జాబ్స్ పెరుగుతున్నాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి సంస్థలు గిగ్ వర్కర్ల (తాత్కాలిక ఉద్యోగుల) ను నియమించుకుంటున్నాయి. ఈ–కామర్స్ సెక్టార్లో సౌత్ ఇండియాలో సుమారు నాలుగు లక్షల టెంపరరీ జాబ్స్ క్రియేట్ అవుతాయని స్టాఫింగ్ సర్వీస్లను అందించే టీమ్లీజ్ సర్వీసెస్ పేర్కొంది. ఈ జాబ్స్లో 40 శాతం బెంగళూరులో, 30 శాతం చెన్నైలో, 30 శాతం హైదరాబాద్లో క్రియేట్ అవుతాయని అంచనావేసింది. మెట్రో సిటీలలో డిమాండ్ పెరుగుతుందని, అలానే కోయంబత్తూర్, కొచ్చి, మైసూర్ వంటి టైర్ 2, 3 సిటీలలో కూడా రానున్న ఫెస్టివ్ సీజన్లో టెంపరరీ జాబ్స్ పెరుగుతాయని టీమ్లీజ్ పేర్కొంది.
వేర్ హౌస్ ఆపరేషన్స్, డెలివరీ, కాల్ సెంటర్ వంటి వివిధ విభాగాల్లో గిగ్ వర్కర్ల నియామకాలు పెరుగుతాయని తెలిపింది. రానున్న ఫెస్టివల్ సీజన్ కోసం దేశం మొత్తం మీద ఏడు లక్షల తాత్కాలిక ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని టీమ్లీజ్ పేర్కొంది. కేవలం ఈ–కామర్స్లోనే కాకుండా రిటైల్, ఎఫ్ఎంసీజీ, లాజిస్టిక్స్ వంటి ఇతర సెక్టార్లలో కూడా గిగ్ జాబ్స్ క్రియేట్ అవుతాయంది. ‘గత కొన్ని క్వార్టర్లుగా ఈ–కామర్స్ కంపెనీలు ఫెస్టివల్ సీజన్ కోసం రెడీ అవుతున్నాయి. కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది 25 % ఎక్కువ గిగ్ జాబ్స్ క్రియేట్ అవుతాయని అంచనావేస్తున్నాం. సౌత్ ఇండియాలో 30% ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి’ అని టీమ్లీజ్ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రమణియన్ అన్నారు.
లక్ష జాబ్స్ ఇవ్వనున్న ఫ్లిప్కార్ట్..
పండుగ సీజన్లో లక్షకు పైగా సీజనల్ జాబ్స్ (టెంపరరీ జాబ్స్) క్రియేట్ చేస్తామని ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్ను చేరుకోవడానికి సప్లయ్ చెయిన్ను మరింత బలోపేతం చేస్తామని, ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, డెలివరీ హబ్ల దగ్గర ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపింది. ‘బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్ కానుంది. కెపాసిటీ, స్టోరేజ్, ప్లేస్మెంట్, సార్టింగ్ (ప్రొడక్ట్లను వేరు చేయడం), ప్యాకేజింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ట్రైయినింగ్, డెలివరీ, మొత్తం సప్లయ్ చెయిన్ను బలోపేతం చేయాల్సి ఉంటుంది’ అని ఫ్లిప్కార్ట్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ బద్రి పేర్కొన్నారు. అంగవైకల్యం ఉన్నవారిని కూడా నియమించుకుంటామని ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. కిరాణా డెలివరీ ప్రోగ్రామ్ ద్వారా ఈ ఏడాది 40 శాతం ఎక్కువ డెలివరీలు చేస్తామని తెలిపింది.