న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో రెండు జట్లను చేర్చేందుకు బీసీసీఐ జనరల్ బాడీ అప్రూవల్ ఇవ్వనుంది. గురువారం జరిగే ఏజీఎంలో పది జట్ల ఐపీఎల్కు గ్రీన్ సిగ్నల్ లభించడం లాంఛనమే. అయితే, 2021 ఐపీఎల్లో ఎనిమిది జట్లే ఆడనున్నాయి. పది జట్ల ఐపీఎల్ చూడాలంటే 2022 వరకూ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్ 14వ సీజన్ మరో నాలుగు నెలల్లోనే జరగనుంది. కాబట్టి ఇంత తక్కువ టైమ్లో ఓ కాంపిటీటివ్ టీమ్ను సిద్ధం చేసుకోవడం సాధ్యం కాదని, అందువల్ల తొమ్మిది లేదా పది ఫ్రాంచైజీలతో లీగ్ నిర్వహించాలనుకోవడం తొందర పాటు నిర్ణయం అవుతుందని స్టేక్ హోల్డర్లు భావిస్తున్నారు.
ఇదే అంశాన్ని స్టేక్ హోల్డర్లు ఏజీఎంలో లేవనెత్తనున్నారు. ‘2021 ఐపీఎల్ ఏప్రిల్లో జరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. కాబట్టి మెగా ఆక్షన్, రిటెన్షన్ పాలసీలు డిసైడ్ చేసేందుకు చాలా తక్కువ టైమ్ ఉంటుంది. కొత్త టీమ్ను యాడ్ చేయాలంటే ముందుగా టెండర్లను ఇన్వైట్ చేసి తర్వాత బిడ్డింగ్ ప్రాసెస్ రెడీ చేయాలి. జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి బిడ్డింగ్ ముగిస్తే.. వేలం కోసం కొత్త ఫ్రాంచైజీలకు కొంత టైమ్ ఇవ్వాలి. కానీ, ఆక్షన్ మార్చిలోనే నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి కొత్త సీజన్కు ప్లాన్ చేసేందుకు న్యూటీమ్స్కు చాలా తక్కువ సమయం ఉంటుంది’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

