- 20 మందిని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు
కడెం, వెలుగు: నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేట్ పునరావాస గ్రామస్తులకు భూముల హద్దులు చూపిస్తుండగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ గ్రామస్తులకు భూములు కేటాయించిన తర్వాతే హద్దులు నిర్ణయించాలని నచ్చన్ ఎల్లాపూర్ గోండుగూడ గిరిజనులు ఆందోళనకు దిగారు. దీంతో 20 మంది ఆందోళనకారులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకొని జన్నారం మండలం ఇందన్ పల్లి రేంజ్ ఆఫీస్కు తరలించారు. మంగళవారం ఎఫ్డీవో శివకుమార్, సీఐలు సత్యనారాయణ, సమ్మయ్య, 150 మంది పోలీసులు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది భారీ బందోబస్తు మధ్య మైసంపేట్ పునరావాస గ్రామస్తులకు కేటాయించిన భూమిని చదుకు చేశారు.
అనంతరం రెవెన్యూ అధికారులు హద్దు రాళ్లను పాతి నంబర్లు వేస్తుండగా, ఆ భూమిలో కొంత తాము సాగు చేశామని, దానిని తమకు ఇవ్వాలని నచ్చన్ ఎల్లాపూర్ గోండుగూడ గిరిజనులు పట్టుబట్టారు. గతంలో ఉన్న తమ భూములను తిరిగి సాగు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో గందరగోళం నెలకొంది. ఈక్రమంలో తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మైసంపేట్ గిరిజనులు కోరుతున్నారు.
