ఏపూరి సోమన్నపై దాడికి యత్నం.. షర్మిల సీరియస్

ఏపూరి సోమన్నపై దాడికి యత్నం.. షర్మిల సీరియస్
  • వైఎస్ విగ్రహం వద్ద షర్మిల ధర్నా
  • టీఆర్ఎస్ గూండాలను అరెస్టు చేయాలని డిమాండ్
  • కేసు పెట్టి.. అరెస్టు చేసే వరకు కదిలేది లేదంటూ  బైఠాయించిన షర్మిల

సూర్యాపేట జిల్లా: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిర్వహిస్తున్న పాదయాత్రలో ఉద్రిక్తత ఏర్పండింది. హుజూర్నగర్ మండలం లక్కవరం గ్రామంలో దీక్ష ముగించుకుని వెళ్తుండగా.. వైఎస్ఆర్ టీపీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్నపై దాడికి ప్రయత్నించారు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయగా.. అరుపులు కేకలతో తోపులాటలు జరిగాయి.


ఏపూరి సోమన్న పక్కనున్న మహిళా నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగగా.. తోసేసేప్రయత్నం చేయడాన్ని గమనించిన షర్మిల ఆగ్రహానికి లోనయ్యారు. ఆడవాళ్లపై దాడి చేస్తారా.. అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే సైదిరెడ్డే టీఆర్ఎస్ గూండాలను పంపారని ఆరోపించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. దీక్షా స్థలానికి వచ్చిన  టీఆర్ఎస్ మఠంపల్లి మండల అధ్యక్షుడు పిచ్చయ్యపై మండిపడ్డారు షర్మిల. మహిళలపై దాడి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు షర్మిల.

 వైఎస్ విగ్రహం వద్దకు చేరుకుని కార్యకర్తలతో కలసి బైఠాయించారు. పోలీసు జులుం నశించాలి.. టీఆర్ఎస్ డౌన్.. డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దాడికి ప్రయత్నించిన ఇద్దర్నీ చూశారు కదా.. చూసి కూడా ఎందుకు పట్టుకోలేదు.. వాళ్లిద్దర్నీ తీసుకుని రండి.. కేసు పెట్టి అరెస్టు చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ షర్మిల తేల్చి చెప్పారు.