నిజామాబాద్ జిల్లాలో హోరాహోరీగా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు

నిజామాబాద్ జిల్లాలో హోరాహోరీగా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు

నిజామాబాద్, వెలుగు : ఇందూర్ ఆర్యవైశ్య సంఘంతో పాటు అనుబంధ సంఘాల కమిటీ ఎన్నికలు ఆదివారం హోరాహోరీగా జరిగాయి. మాణిక్​భవన్ స్కూల్​లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ జరగగా, గొడవల కారణంగా రాత్రి వరకు పోలింగ్​ కొనసాగింది.  10,017 మంది ఓటర్లు గ్రూపులుగా విడిపోయారు. ఏకగ్రీవ ప్రయత్నాలు బెడిసికొట్టడంతో జనరల్​ ఎలక్షన్స్​ను తలపించాయి. నగర ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ  బాబాయ్ కొడుకు ధన్​పాల్​ శ్రీనివాస్, వ్యాపారవేత్త అర్వపల్లి పురుషోత్తంగుప్తా తలపడ్డారు.

 ఒకరికి బీజేపీ సపోర్టు ఉండగా, మరొకరికి కాంగ్రెస్​ మద్దతు ఉంది. నగరంలోని ఆర్యవైశ్య హైస్కూల్ కమిటీ, వైశ్య భవన్​ కమిటీ, కన్యాకాపరమేశ్వరీ టెంపుల్​ కమిటీకి ఎన్నికలు నిర్వహించారు. బ్యాలెట్​ పేపర్స్​ బయటకు రావడంతో పాటు ఒక ప్యానెల్ సభ్యులు దగ్గరుండి ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ పోలింగ్​ సెంటర్​లోకి ప్రవేశించి గొడవ చేశారు. ఎలక్షన్​ రద్దు చేయాలని నినాదాలు ఇచ్చారు.  పోలీసులు వచ్చి శాంతింపజేశారు. సోమవారం కన్యాకాపరమేశ్వరీ ఆలయంలో ఓట్ల లెక్కింపు జరుగనున్నదని సంఘం ప్రతినిధులు తెలిపారు.