- నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ
- సీసీ కెమెరాల మధ్య పేపర్ల ఓపెన్
హైదరాబాద్, వెలుగు : రేపు జరిగే టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)కు నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు. చెప్పిన టైమ్ కంటే నిమిషం ఆలస్యమైనా సెంటర్లోకి అనుతించమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్లోకి అరగంట ముందే పంపిస్తామని తెలిపారు. ఆదివారం జరిగే టెట్కు మొత్తం 3,80,589 మందికి గానూ శుక్రవారం సాయంత్రం నాటికి 3,61,205 మంది హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. పేపర్ 1 ఎగ్జామ్ 1480 సెంటర్లలో నిర్వహిస్తుండగా.. 3,51,468 మంది, పేపర్ 2 ఎగ్జామ్ 1203 సెంటర్లలో జరుగుతుండగా.. 2,77,884 మంది రాయబోతున్నారు.
ఈ పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 29,513 మంది ఇన్విజిలేటర్లను, 1480 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 1480 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లను, 252 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్స్ను నియమించారు. అన్ని కేంద్రాల్లోని సీఎస్ రూముల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అక్కడే పేపర్లను ఓపెన్ చేసి ప్యాక్ చేయాలని డీఈఓలకు ఆదేశాలు జారీచేశారు. సిబ్బందితో పాటు సెంటర్లలోని అధికారులూ సెల్ఫోన్ వాడకంపై నిషేధం విధించినట్టు టెట్ కన్వినర్ రాధారెడ్డి చెప్పారు.
అభ్యర్థులు ముందుగానే సెంటర్లకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రతీ స్టూడెంట్ రెండు బ్లాక్ బాల్ పెన్స్ తెచ్చుకోవాలని, ఓఎంఆర్ షీట్లో సర్కిల్స్ పూర్తి షేడ్ చేయాలని సూచించారు.