
- ఆర్జీయూకేటీ యాక్ట్లో సవరణలు
- అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులు పెట్టే యోచనలో సర్కార్
- ఆ వెంటనే రెండు వర్సిటీలకు రెగ్యులర్ వీసీల నియామకం
- ప్రతిపాదనలు సిద్ధం చేసిన విద్యాశాఖ అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండు గవర్నమెంట్ యూనివర్సిటీలకు ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకురానున్నది. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)కి చట్టసవరణతో పాటు తెలంగాణ మహిళా యూనివర్సిటీ యాక్ట్ బిల్లులు పెట్టేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే, ఈ రెండు వర్సిటీలకూ కొత్త వీసీలను సర్కారు నియమించనున్నది. ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి 2008లో ఆర్జీయూకేటీని ఏర్పాటు చేశారు. అయితే, ఇది ఇతర వర్సిటీలకు భిన్నంగా ఉన్నది. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు దీన్ని ప్రారంభించారు. అయితే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ వర్సిటీని గాలికి వదిలేసింది. వర్సిటీ వీసీగా కొనసాగిన రాజ్ కుమార్ పదవీకాలం 2015లో ముగిసిన తర్వాత, అక్కడ రెగ్యులర్ వీసీని నియమించ లేదు. ప్రస్తుతం పది వర్సిటీలకు వీసీల నియామక ప్రక్రియ ప్రారంభమైంది.
ఓయూ రూల్సే ఫాలో అవుతున్న మహిళా వర్సిటీ
హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కాలేజీని ప్రభుత్వం తెలంగాణ మహిళా యూనివర్సిటీగా రెండేండ్ల కింద అప్ గ్రేడ్ చేసింది. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ వర్సిటీకి యాక్ట్ ను ఏర్పాటు చేయలేదు. దీంతో ఇంకా ఉస్మానియా వర్సిటీ రూల్స్ నే ఫాలో అవుతున్నారు. వర్సిటీ ఏర్పడినా.. కేవలం ఇన్చార్జ్ వీసీగా కోఠి ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ నే పెట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు వదిలేశారు. వంద కోట్ల నిధులు ఇస్తామని బడ్జెట్ లో చెప్పినా.. పైసా ఇవ్వలేదు. అయితే, మహిళా వర్సిటీకి యాక్ట్ ఉంటేనే.. రెగ్యులర్ వీసీ, ఇతర అధికారులను నియమించుకునే అవకాశం ఉంటుంది. దీంతో యాక్ట్ ను తీసుకురావాలని సర్కారు నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు వర్సిటీ యాక్ట్ ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ రెండు యూనివర్సిటీల యాక్టులకు సంబంధించిన బిల్లులను పెట్టే అవకాశం ఉంది. ఆ వెంటనే, రెండు వర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించాలని సర్కారు నిర్ణయించింది.
ఆర్జీయూకేటీకి పదేండ్లుగా ఇన్చార్జ్ వీసీ
పదేండ్ల నుంచి ఆర్జీయూకేటీని ఇన్చార్జ్ వీసీతోనే నెట్టుకొస్తుండటంపై విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ సమావేశం నిర్వహించి ఆరా తీశారు. వీసీ నియామకానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఇప్పుడున్న యాక్ట్ను సవరించాలని విద్యా శాఖ అధికారులు నిర్ణయించారు. వర్సిటీ చాన్స్లర్గా విద్యావేత్త ఉండాలనే నిబంధన ఉంది. దీన్ని అన్ని వర్సిటీల మాదిరిగానే వర్సిటీ చాన్స్లర్గా గవర్నర్ను పెట్టాలని భావిస్తున్నారు. ఇతర వర్సిటీల మాదిరిగానే.. ఆర్జీయూకేటీ యాక్ట్లో సవరణలు చేయాలని డిసైడ్ అయ్యారు. దీనికి అనుగుణంగా ఇప్పటికే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు ప్రతిపాదనలను సర్కార్కు పంపించారు.