- 7 హోటళ్లపై టీజీ సేఫ్ అధికారులు దాడులు
- మూడింటికి షోకాజ్ నోటీసులు జారీ
హైదరాబాద్లోని ఏడు ప్రముఖ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కుళ్లిపోయిన కూరగాయలు వాడుతున్నట్లు నిర్ధారించారు. ఆహార పదార్థాల నిల్వ, నిర్వహణలో నిబంధనలు పాటించకపోవడం, కిచెన్లలో బొద్దింకల్లాంటి పురుగులు ఉండటంపై అధికారులు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్, వెలుగు: సిటీలోని పలు ప్రముఖ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) కు చెందిన ఆరు ఎన్ఫోర్స్ మెంట్ టీమ్స్.. పోలీసులతో కలిసి క్యూర్ పరిధిలోని మొత్తం ఏడు రెస్టారెంట్లలో ఏకకాలంలో దాడులు చేపట్టాయి. బంజారాహిల్స్లోని చట్నీస్, స్పైస్ 6, ఓహ్రీస్ రెస్టారెంట్లు, జూబ్లీహిల్స్లోని ది స్పైసీ వెన్యూ, టోలిచౌకిలోని 4 సీజన్స్ మల్టీకుజిన్, షా గౌస్ హోటల్, గచ్చిబౌలిలోని పిస్తా హౌస్ రెస్టారెంట్లను అధికారులు తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో అధికారులు పలు ఉల్లంఘనలను గుర్తించారు. కొన్ని రెస్టారెంట్లలో అపరిశుభ్రతతో పాటు గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కుళ్లిపోయిన కూరగాయలు వాడుతున్నట్లు నిర్ధారించారు. ఆహార పదార్థాల నిల్వ, నిర్వహణలో నిబంధనలు పాటించకపోవడం, కిచెన్లలో బొద్దింకలు వంటి పురుగులు ఉండటంపై అధికారులు చర్యలు చేపట్టారు.
ఫుడ్ సేఫ్టీ రూల్స్ ప్రకారం.. ఉండాల్సిన లేబులింగ్, డిస్ప్లే రూల్స్ కూడా సదరు హోటళ్లు పాటించడం లేదని తనిఖీల్లో తేలింది. ఆహారం కల్తీ అయిందన్న అనుమానంతో 11 శాంపిల్స్ను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపారు. నిబంధనలు సరిగ్గా లేని నాలుగు హోటళ్లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు, మరో మూడు హోటళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
