
హైదరాబాద్, వెలుగు: కరెంటు బిల్లుల మొండి బకాయిల వసూళ్ల కోసం సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్పీడీసీఎల్) ప్రత్యేక డ్రైవ్ను చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ జోన్లలో చీఫ్ ఇంజనీర్లు, అకౌంట్ అధికారులు, జనరల్ మేనేజర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. రంగారెడ్డి జోన్ చీఫ్ ఇంజనీర్ పాండ్యా, జనరల్ మేనేజర్ పి. అంజయ్య.. మణికొండ ప్రాంతంలో పర్యటించి, బిల్ స్టాప్ సర్వీసులను తనిఖీ చేశారు. పంచవటి కాలనీలో రూ. 85 లక్షల బకాయిలున్న ఓ సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అలాగే, రంగారెడ్డి జిల్లా జోన్లోని సైబర్ సిటీ, రాజేంద్రనగర్, సరూర్నగర్ సర్కిళ్లలో పేరుకుపోయిన బకాయిల వసూళ్లకు చర్యలు చేపట్టాలని సూచించారు.
కార్యక్రమంలో సైబర్ సిటీ ఎస్సీ రవి కుమార్, ఇబ్రహీం భాగ్ ఏడీఈ అంబేద్కర్, ఏఈ సంతోష్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 728 హై టెన్షన్ (హెచ్టీ) బిల్ స్టాప్ సర్వీసులతో రూ. 600 కోట్లు... 9.19 లక్షల లో టెన్షన్ (ఎల్టీ) సర్వీసులతో రూ. 188 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. బిల్లుల చెల్లింపు కోసం చర్యలు చేపట్టినప్పటికీ స్పందన లేకపోవడంతో బిల్ స్టాప్ సర్వీసుల వద్ద బకాయిల మొత్తాన్ని పేర్కొంటూ నోటీసు బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ చర్యల ఫలితంగా ఇప్పటివరకు రూ. 100 కోట్ల బకాయిలు వసూలైనట్లు సంస్థ వెల్లడించింది. సీఎండీ ముషారఫ్ ఫారూఖీ హెచ్టీ బిల్ స్టాప్ సర్వీసులను తక్షణమే తనిఖీ చేసి, సంబంధిత లింక్ సర్వీసులను గుర్తించి, బకాయిల వసూళ్ల కోసం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.