TGSRTC: కార్గో నుంచి తీసుకెళ్లని టీవీలు, ఫోన్లు, బట్టల వేలం!

TGSRTC:   కార్గో నుంచి తీసుకెళ్లని టీవీలు, ఫోన్లు, బట్టల వేలం!
  • ఆగస్టు 20 న  జేబీఎస్​లో నిర్వహించనున్న ఆర్టీసీ 
  • 50 నుంచి 80 శాతం డిస్కౌంట్​
  •  నెలకు 600 – 700 పార్శిళ్లు తీస్కపోతలేరు  
  • కాంటాక్ట్​ అయినా నో రెస్పాన్స్​  ..అందుకే వేలం పాటలో అమ్మకం 

హైదరాబాద్​సిటీ, వెలుగు : కార్గో సర్వీసును ప్రవేశపెట్టి వస్తువులను చేరవేస్తున్న ఆర్టీసీ.. డెలివరీ కాని, తీసుకోని ఐటమ్స్​ను వేలం వేస్తోంది. చాలా మంది డెలివరీ తీసుకోకుండా వదిలేస్తుండడంతో ఆ పార్శిళ్లన్నీ ఆర్టీసీ గోదాముల్లో కుప్పలు తెప్పలుగా మూలుగుతున్నాయి. తీసుకువెళ్లాలని ఫోన్​ చేస్తే నంబర్లు పని చేయకపోవడం, అడ్రస్​కు వెళ్తే రాంగ్​ అని చెప్తుండడంతో వేలంలో అమ్మేస్తున్నారు. ఏ ఐటమ్​అయినా 45 రోజుల్లో తీసుకువెళ్లాలన్న నిబంధన ఉండడంతో.. ఆ రూల్​బ్రేక్​చేసిన వారి వస్తువులను బహిరంగ వేలంలో 50 నుంచి 80 శాతం డిస్కౌంట్​కు తీసేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం జేబీఎస్​లో గతంలో వేలం వేయగా మిగిలిన వస్తువులకు ఎక్కువ డిస్కౌంట్​తో తిరిగి వేలం  వేయనున్నారు. 

సిటీలోని 90 ఏరియాల్లో సెంటర్లు 

నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వస్తువులను చేరవేసేందుకు కార్గో సర్వీస్ ద్వారా ఆర్టీసీ సిటీలోని 90 ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజా మాబాద్​, మెదక్​ తదితర జిల్లాల్లోనూ కేంద్రాలున్నాయి. ప్రతినెలా ఆయా ప్రాంతాలకు 7 వేల నుంచి 8 వేల వస్తువులను ఆర్టీసీ డెలివరీ చేస్తోంది. ఇందులో 600 నుంచి 700 వరకు వస్తువులను కస్టమర్లు తీసుకువెళ్లడం లేదు. 

ఇలా జేబీఎస్, ఎంజీబీఎస్​లలోని కార్గో డెలివరీ కేంద్రాల్లో వందల కొద్దీ వస్తువులు పడి ఉన్నాయి. వీటిలో మొబైల్స్, టీవీలు, గృహోపకరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్, బట్టలు, ఫుడ్​ఐటమ్స్​ఉన్నాయి. క్యాష్ ఆన్ డెలివరీ పేరుతో వీటిని బుక్ చేసి కార్గోకు వచ్చిన తర్వాత తీసుకువెళ్లడం లేదంటున్నారు. సాధారణంగా కార్గోకు వచ్చిన పార్శిళ్లను మూడు రోజుల్లో ఉచితంగా డెలివరీ చేస్తారు. తర్వాత రోజుకు రూ. 25 పెనాల్టీ వసూలు చేస్తారు. చాలామందిని కాంటాక్ట్​కావడానికి ప్రయత్నిస్తే  అడ్రస్ , ఫోన్ నంబరు తప్పుగా ఉండడంతో వీలు కావడం లేదంటున్నారు. ఛార్జీలు ఎక్కువ కావడంతో ఆయా కంపెనీల ప్రతినిధులు కూడా ఆసక్తి చూపించడం లేదంటున్నారు. 45 రోజుల వరకు చూసి వేలం వేస్తున్నామని చెప్తున్నారు. 

డెలివరీ కాని వస్తువుల వేలం

ప్రతినెలా 30 నుంచి 50 శాతం డిస్కౌంట్​తో వస్తువుల వేలం వేస్తున్నామని ఆర్టీసీ కార్గో అధికారులు చెప్తున్నారు. మొదటి సారి వేలం వేస్తే 50 శాతం, రెండో సారి 80 శాతం, మూడోసారి  90 శాతం డిస్కౌంట్​తో వేలం వేస్తున్నారు. టీవీలు, మొబైల్స్ వంటివి ఉండడంతో జనాలు వేలంలో ఉత్సాహంగానే పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా గతంలో వేలం వేయగా మిగిలిన వస్తువులను జేబీఎస్ ఆర్టీసీ కార్గో సెంటర్లలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు వేలం వేయనున్నట్టు ఆర్టీసీ అసిస్టెంట్​ట్రాఫిక్​ మేనేజర్​(లాజిస్టిక్​) ఇషాక్​బిన్​మహ్మద్​ తెలిపారు.  పార్శిల్ కి ​సంబంధించి ఫిప్​మెంట్​ వ్యాల్యూ మీద 30శాతం ధరలకే వేలం వేయనున్నట్టు తెలిపారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు జూబ్లీ బస్​స్టేషన్​లోని ప్లాట్​ఫామ్​ నెం.14 పక్కన ఉన్న కార్గో కౌంటర్​లో వేలం ఉంటుందని తెలిపారు. 

వేలం వేసే వస్తువులివే..

వేలం వేసే వస్తువుల్లో 56 ఆటోమొబైల్స్​ఐటమ్స్, 24 ​ఎలక్ట్రికల్ ఐటమ్స్​ , 32 క్లాత్​ ఐటమ్స్​, 32 ఎలక్ట్రానిక్​ ఐటమ్స్​, 8 హౌస్​హోల్డ్​ మెటీరియల్స్​ , 6 హార్డ్​వేర్ ఐటమ్స్​, 5 ఇండస్ట్రియల్​ స్పేర్స్​, 379  జనరల్​ ఐటమ్స్​ కలిపి  542 వస్తువులను వేలం వేయనున్నట్టు తెలిపారు.