న్యూఢిల్లీ: అహ్మదాబాద్లోని తమ పార్టీ ఆఫీసులో పోలీసులు జరిపిన తనిఖీలు చట్టవిరుద్ధమని, దీనికి సంబంధించి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. సోదాల గురించి తాము అడిగే ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సిద్ధంగా ఉంటే ఆ ఆధారాలు చూపుతామని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. సోమవారం ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. కోర్టు ఆర్డర్ కానీ, వారంట్ కానీ లేకుండానే పోలీసులు అహ్మదాబాద్ పార్టీ కార్యాలయంలో దౌర్జన్యంగా ప్రవేశించి, రెండు గంటలపాటు తనిఖీలు చేశారని ఆయన ఆరోపించారు. సోదాలు ముగించి వెళ్తున్నపుడు తాము మళ్లీ వస్తామని బెదిరించారని అన్నారు. ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్కు గుజరాత్లో పెరుగుతున్న ఆదరణను చూసి బీజేపీ భయపడుతోందని ఆయన పేర్కొన్నారు.