సూర్యాపేట: గ్రామాల్లో చేసిన వివిధ అభివృద్ధి పనుల బిల్లులు నెలల తరబడి రాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులకు కష్టాలు మొదలయ్యాయి. సూర్యాపేట జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.10కోట్లకు పైగా బిల్లులు ట్రెజరీలో పెండింగ్ పడ్డాయి. దీంతో సెక్రెటరీలు ట్రాక్టర్ల ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. దీంతో బ్యాంకర్లు పంచాయతీ కార్యదర్శుల జీతాలు ఆపుతున్నారు. పంచాయతీలకు ప్రభుత్వం బ్యాంక్లోన్లపై ట్రాక్టర్లు ఇప్పించింది. వీటిని పంచాయతీ కార్యాదర్శుల పేరు మీద కొనుగోలు చేశారు. దీంతో ప్రతి నెలా ఈఎంఐ చెల్లించాల్సిన బాధ్యత సెక్రెటరీలపై పడింది. చెక్కులు ట్రెజరీలలో మంజూరు కాకపోవడంతో బ్యాంకర్లు సెక్రెటరీల అకౌంట్లను ఫ్రీజింగ్ లో పెడుతున్నారు. సూర్యాపేట జిల్లాలోని చిలుకూర్ మండలం రామచంద్ర నగర్, జెర్రిపోతుల గూడెం, చెన్నూరు గూడెం, ఆచార్యుల గూడెం, కొమ్ముబండ తండా, మోతే కార్యదర్శుల అకౌంట్లపై ఫ్రీజింగ్ పెట్టడంతో వాళ్లకు జీతాలు రావడం లేదు. కొందరి ఆస్తులను జప్తు చేస్తామని లీగల్ నోటీసులు పంపడం గమనార్హం.
ఫ్రీజింగ్ పెట్టిన మాట వాస్తవమే
ట్రాక్టర్ల ఈఎంఐ కట్టడంలేదని పంచాయతీ కార్యదర్శుల అకౌంట్లను ఫ్రీజింగ్ పెట్టిన మాట వాస్తవం. దీనిపై బ్యాంకర్లతో మాట్లాడి ఫ్రీజింగ్ పెట్టవద్దని ఆర్డర్స్ ఇచ్చాం. బిల్లులు ట్రెజరీలో ఉండడం వల్లే ఈ సమస్య వచ్చింది. త్వరలోనే బిల్లులు పాస్ అవుతాయి. -యాదయ్య, డీపీఓ, సూర్యాపేట