ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీతో పాటు మరో నలుగురికి నెల రోజుల జైలుశిక్ష

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీతో పాటు మరో నలుగురికి నెల రోజుల జైలుశిక్ష

ఏపీ అధికారులపై ఆ రాష్ర్ట హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఐదుగురు అధికారులకు నెలరోజులు జైలు శిక్ష విధించింది. సీనియర్ ఐఏఎస్ (రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి) కృష్ణ బాబు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు నెల రోజులు జైలు శిక్ష, వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. 16వ తేదీలోగా రిజిస్ట్రార్ జ్యుడీషియల్ ముందు లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించింది. వెంటనే జైలుకు పంపాలని రిజిస్ట్రార్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వుల అమలు బాధ్యత ఉన్నతాధికారులదేనని, ఉత్తర్వుల అమల్లో ఇబ్బందులు ఉంటే కోర్టుకు తెలిపి.. గడువు పొడిగించాలంటూ అభ్యర్థించాలని పేర్కొంది. వీరితో పాటు మరో ముగ్గురు ఆర్టీసీ అధికారులకు కూడా ఏపీ హైకోర్టు షాకిచ్చింది. 

కోర్టు ఆదేశాలను అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని మండిపడింది. ఆర్టీసీలో ఫీల్డ్‌మెన్‌గా పని చేస్తున్న చిత్తూరుకు చెందిన బి.సురేంద్ర, మరో ముగ్గురు తమ సర్వీస్‌ను క్రమబద్ధీకరించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం... ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, వారి జీతాలకు 7% వడ్డీ కలిపి పిటిషనర్లకు చెల్లించాలంటూ 2022 ఆగస్టులో ఆదేశించింది. అయితే..ఇప్పటికీ హైకోర్టు ఆదేశాలు అమలుకాకపోవడంతో బి.సురేంద్ర, మరో ముగ్గురు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. అప్పీల్ పెండింగ్‌లో ఉందంటూ ఆర్టీసీ లాయర్లు వాదించారు. అప్పీల్‌పై డివిజినల్ బెంచ్ స్టే విధించలేదని హైకోర్టు గుర్తు చేసింది. అందుకే అధికారులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.