- ముగిసిన దరఖాస్తు గడువు
- వచ్చేనెల 15న పరీక్ష
హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)కు మొత్తం 2,91,058 దరఖాస్తులు వచ్చాయి. బుధవారం అర్ధరాత్రితో గడువు ముగిసింది. మొత్తం 2,97,055 మంది ఫీజు చెల్లించారు. కానీ, కొందరు అప్లై చేసుకోలేదు. పేపర్1 కు 2,69,557 మంది, పేపర్ 2కు 2,08,498 మంది అప్లై చేసినట్టు టెట్ కన్వీనర్ రాధారెడ్డి చెప్పారు. అయితే, అప్లికేషన్లు మాత్రం ప్రత్యేకంగా పేపర్1కు 82,560, పేపర్ 2కు 21,501, రెండింటికీ కలిసి 1,86,997 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. కాగా, వచ్చేనెల 15న రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష జరగనున్నది.
హైదరాబాద్లోనే ఎక్కువ..
టెట్ లో పేపర్ 1, 2 రెండింటికీ హైదరాబాద్లోనే ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. పేపర్ 1లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 28,333 మంది దరఖాస్తు చేసుకోగా ఆ తర్వాత మహబూబ్ నగర్లో 18,566 మంది, రంగారెడ్డిలో 15,490 మంది, నిజామాబాద్జిల్లాలో 15,263 మంది అప్లై చేశారు. అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,421 మంది, ములుగులో 1,892 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 2కు అత్యధికంగా హైదరాబాద్లో 21,821 మంది, మహబూబ్ నగర్లో 13,581, రంగారెడ్డిలో 13,386 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లిలో 1,178, ములుగులో 1,295 మంది అప్లై చేశారు.