తహసీల్దార్ విజయారెడ్డి హత్య దారుణం: బాబు

తహసీల్దార్ విజయారెడ్డి హత్య దారుణం: బాబు

హైదరాబాద్ లో నిన్న జరిగిన తహసీల్దార్ విజయారెడ్డి హత్యపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. ఆమె మృతి దురదృష్టకరమని ఆయన అన్నారు. దేశమంతా సాంకేతికంగా ముందుకు వెళ్తుంటే.. మనిషి మాత్రం ఇలా అనాగరికంగా మారడం శోచించదగ్గ విషయమన్నారు. ఇటువంటి ఘటనల్నిప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన అన్నారు. నిన్నటి ఘటనలో మృతి చెందిన విజయారెడ్డి, ఆమె డ్రైవర్ గురునాథం కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన తన ట్విట్టర్ లో ఈ విధంగా పోస్ట్ చేశారు.

‘నిన్న తెలంగాణలో జరిగిన మహిళా తహసీల్దార్ హత్య దారుణం, దురదృష్టకరం. సమాజంలో రోజురోజుకూ అసహనం పెరిగిపోవడం అవాంఛనీయం. సాంకేతికంగా సమాజం ముందుకు పోతుంటే, మనిషి మాత్రం మానసికంగా ఇలా క్రూరంగా, అనాగరికంగా తయారవడం శోచనీయం. ఇలాంటి సంఘటనల్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తహసీల్దార్ విజయగారు, ఆమెను కాపాడే ప్రయత్నంలో మృతిచెందిన డ్రైవర్‌ గురునాథం కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’.