విభిన్న సంప్రదాయాలు, సంస్కృతులు ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాలతో ఏర్పడిన మనదేశంలో ఆడవాళ్లపై దాష్టీకాలు అన్ని చోట్లా మామూలే. కానీ, వీటి తీవ్రత నార్త్ఈస్ట్ స్టేట్స్(ఈశాన్య భారతం)లో ఎక్కువ. సెవెన్ సిస్టర్స్(అరుణాచల్ ప్రదేశ్, అసోం, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, మిజోరం, మణిపూర్)గా పిలిచే ఈ రాష్ట్రాల్లోని మహిళల, ముఖ్యంగా అసోం ఆడవాళ్ల వెతలకు దర్పణమే ‘ది బ్లాక్ మ్యాజిక్ ఉమన్’ పుస్తకం. అస్సామీ రచయిత్రి, జర్నలిస్ట్ మౌషుమి కందాలి రాసిన పది కథలను మరో జర్నలిస్ట్ పర్బీనా రషీద్ ఇంగ్లీష్లోకి అనువదించారు.
రూపం వల్ల వందల ఏండ్ల కిందటే అసోం మహిళలపై పడిన ‘మంత్రగత్తె’, ‘మాయలాడి’ ముద్రలను పుస్తకంలోని తొలి కథ ‘ది బ్లాక్ మ్యాజిక్ ఉమన్’ చెప్తుంది. సంస్కృతి, సంప్రదాయాలను సాకుగా చూపుతూ అక్కడి ఆడవాళ్లు లైంగికంగా, శారీరకంగా, మానసికంగా ఎదుర్కొంటున్న సమస్యలను అన్ని కథలూ మనసును మెలితిప్పేలా చెప్తాయి. అంతేకాదు, ఈశాన్య మహిళలు దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నారో చదువుతుంటే కళ్లలో తడి కదలాడుతుంది. కథలన్నీ అందరికీ అర్థమయ్యేలా చక్కటి భాషలో రాశారు.
::: సాయిప్రేమ్