నీటి తొట్టెలో పడి బాలుడి మృతి

నీటి తొట్టెలో పడి బాలుడి మృతి

జూలూరుపాడు, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఓ ఇంటి ఆవరణలో ఆడుకొంటున్న చిన్నారి నీటి తొట్టెలో పడి చనిపోయాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలూరుపాడు మండలం పాపకొల్లు పంచాయతీ పరిధిలోని భీమ్లా తండాకు చెందిన గుగులోత్ శ్రీను, హరిత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కొడుకులు చేతన్​భార్గవ్, రిషి కుమార్(2). బుధవారం ఉదయం పిల్లలను నాయనమ్మ దేవ్లీ వద్ద ఉంచి శ్రీను, హరిత పొలం పనులకు వెళ్లారు. చిన్నారులు ఇంటి బయట ఆడుకుంటున్న టైంలో దేవ్లీ పని చేసుకుంటోంది. రిషి కుమార్ ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టెలో పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత బాలుడు కనిపించకపోవడంతో వెతకగా తొట్టెలో విగతజీవిగా కనిపించాడు. బయటికి తీసి స్థానిక హాస్పిటల్​వద్దకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్ ​తెలిపారు.